More Than 2 Percent DA Hike To Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తీపి కబురు ఇది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డీఏ కన్నా అధిక మొత్తంలో పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు డీఏను భారీ స్థాయిలో పెంచబోతుందని సమాచారం. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ డీఏ రానుంది? ఎంత మొత్తంలో ఉండబోతుందనే తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన ఉద్యోగులకు కరువు భత్యం (డీఉ) పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024 జూలై-డిసెంబర్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 3% పెరిగింది. మార్చిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జనవరి 2025 నుంచి కరవు భత్యాన్ని మరో 2 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో కరవు భత్యం 55 శాతానికి పెరుగుతుంది.
కరువు భత్యం తాజా పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ లెవల్ 1 ఉద్యోగుల ప్రాథమిక జీతం రూ.18 వేలు (7వ వేతన సంఘం) ఉండగా.. ప్రస్తుత 2 శాతం పెంపుదలతో జీతంలో రూ.360 పెరుగుతుంది. జనవరి - మార్చి నెలలకు సంబంధించిన ఏరియల్స్ మొత్తాన్ని కూడా అందిస్తారు. అంటే రూ.1,080 ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈస్థాయిలో పెంపుదల ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెంపు ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెంపుపై తమిళనాడు ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో కరువు భత్యం పెంపు ప్రకటించనుందని సమాచారం.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పెంచే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరవు భత్యాన్ని పెంచుతాయి. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిని మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన దాని కన్నా ఎక్కువ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 2 శాతం కంటే అధికంగా డియర్నెస్ అలవెన్స్ (కరువు భత్యం) పెంపుదల ప్రకటించవచ్చని తెలుస్తోంది.
పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. వారిని చల్లార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం డీఏను భారీగా పెంచేందుకు సిద్ధమైంది. త్వరలోనే డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు