EPFO Latest Updates: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ నుంచి కొంత మొత్తంలో కట్ చేసి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి.. 8.33% ఈపీఎస్ ఖాతాలో జమ అవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. పదవీ విరమణ చేసిన అనంతరం పీఎఫ్ ఖాతాదారులకు ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
పదవీ విరమణ అనంతరం ప్రతి ఉద్యోగి కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సాఫీగా పోయేలా ఉండేలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాడు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎస్ నుంచి పెన్షన్ అందుతుంది.
ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల నుంచి కొంత మొత్తం.. కంపెనీ నుంచి అంతే మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులు ఎంత పెన్షన్ అందుకుంటారో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందా..
మీ వయస్సు 25 సంవత్సరాలు, మీ మూల జీతం రూ.20 వేలు అనుకుంటే.. 20,000×12% = రూ.2,400 ప్రతి నెలా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇందుకు కంపెనీ సహకారం: రూ.20,000×12% = రూ.2,400. ఇందులో ఈపీఎస్కు: 15,000 × 8.33% = రూ. 1,250, (గరిష్ట జీతం రూ.15 వేలపై ఈపీఎస్ లెక్కింపు ఉంటుంది). ఈపీఎఫ్లో 2,400–1,250 = రూ.1,150 జమ అవుతుంది.
EPFలో మొత్తం: రూ.2,400 (ఉద్యోగి) + రూ.1,150 (కంపెనీ)= రూ.3,550 నెలకు జమ అవుతుంది. EPSలో రూ. 1,250 నెలకు జమ అవుతుంది. 35 ఏళ్ల తర్వాత అంటే ఉద్యోగి పదవీ విరమణ తరువాత ప్రతి నెలా రూ.3,550 లెక్కిస్తే ఏడాదికి రూ.42,600 అవుతుంది.
42,600 రూపాయలకు 8.25 శాతం వడ్డీతో 35 సంవత్సరాలపాటు ప్రతి ఏడాది లెక్కిస్తే.. 68.9 లక్షలు అవుతుంది. మీ డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది. మొదటి సంవత్సరంలో రూ.42,600 పై 8.25% వడ్డీ, వచ్చే ఏడాది మునుపటి డబ్బుతోపాటు వడ్డీపై లభిస్తుంది. ఇలా లెక్కిస్తే.. 35 ఏళ్ల సర్వీస్లో ఆ మొత్తం రూ.68.9 లక్షలకు చేరుతుంది.
రూ.1,250 ప్రతి నెలా ఈపీఎస్లో జమ అవుతుంది. పదవీ విరమణ తర్వాత ఇది పెన్షన్గా మారుతుంది. పెన్షన్= (సర్వీస్ సంవత్సరాలు×సగటు జీతం)÷70. రూ.15 వేలకు లెక్కిస్తే.. పెన్షన్ = (35×15,000)÷70=5,25,000÷70 అంటే నెలకు రూ.7,500 అవుతుంది.
ఈపీఎఫ్ నుంచి రూ.68.9 లక్షలు, EPS నుంచి నెలకు రూ.7,500 అవుతుంది. పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడం కుదరదు. మీరు పదవీ విరమణ తర్వాత 20 సంవత్సరాలు (60 నుంచి 80 సంవత్సరాల మధ్య) జీవిస్తారనుకుంంటే.. 7,500×12×20=రూ.18 లక్షలు పెన్షన్ రూపంలో అందుకుంటారు. అప్పుడు మొత్తం లాభం: రూ.68.9 లక్షలు + రూ.18 లక్షలు = రూ.86.9 లక్షలు అవుతుంది. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మీరు ఎక్కువ కాలం జీవిస్తే.. మరింత పెన్షన్ అందుకుంటారు.
జీతం పెంపుతో ఈపీఎఫ్, ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే అమౌంట్ కూడా పెరుగుతుంది. అప్పుడు పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగి పొందే మొత్తంలో కూడా పెంపు ఉంటుంది.