Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి చరిత్ర సృష్టించాయి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయికి చేరుకుని బంగారం ప్రియులను ఆశ్చర్యపరిచాయి. సెప్టెంబర్ 8, సోమవారం నాటికి తులం బంగారం ధర రూ.1.10 లక్షలు దాటింది. ఇది చరిత్రలోనే తొలిసారి అని చెప్పవచ్చు. అంతేకాదు, బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
1/7సెప్టెంబర్ 8వ తేదీ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,208గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,024గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.1,24,500కి చేరుకుంది. గత వారం రోజులుగా గమనిస్తే బంగారం ధరలు ప్రతిరోజూ వెయ్యి రూపాయల చొప్పున పెరుగుతుండటం మనం గమనించవచ్చు. ఈ నెల ప్రారంభం నుంచి దాదాపు రూ.10,000 పెరిగింది.
2/7బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక గణాంకాలు నిరాశ కలిగించడంతో పాటు డాలర్ విలువ క్షీణించడం ప్రభావం చూపింది. మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి స్థావరంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
3/7అమెరికా మార్కెట్లో కూడా బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఒక ఔన్స్ బంగారం ధర 3650 డాలర్లకు చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ఇది గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారులు బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారని స్పష్టంగా చూపుతోంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకునే మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు.
4/7బంగారం ధరల పెరుగుదలలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనా సెంట్రల్ బ్యాంక్ ఇటీవల భారీ స్థాయిలో బంగారం నిల్వలను పెంచుకోవడం ప్రారంభించింది. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ మరింత పెరిగి ధరలు భారీగా పెరిగాయి.
5/7గత ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.80,000 సమీపంలో ఉండగా, ఇప్పుడు రూ.1.10 లక్షలు దాటడం బంగారం విలువ ఎంత వేగంగా పెరిగిందో స్పష్టంగా చూపుతోంది.
6/7మరోవైపు వెండి ధరలు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.1.25 లక్షలు దాటింది. పారిశ్రామిక రంగంలో వెండి డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం మాత్రమే కాకుండా వెండి వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.
7/7మొత్తం మీద, బంగారం, వెండి ధరలు ఒకేసారి రికార్డు స్థాయికి చేరుకోవడం పెట్టుబడిదారులకు మిశ్రమ సంకేతాలు ఇస్తోంది. ఒకవైపు ధరలు పెరగడం లాభంగా కనిపిస్తే, మరోవైపు సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారుతోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా మారుతాయన్నదే బంగారం ధరల దిశను నిర్ణయించబోతుంది.