India Squad For Champions Trophy 2025 Final: వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకున్న టీమిండియా.. తుది పోరులో న్యూజిలాండ్తో తలపడనుంది. సెమీస్లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్ చేరుకోగా.. సౌతాఫ్రికాను మట్టికరిపించి తుది పోరుకు చేరుకుంది కివీస్. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తుందా..? గాయంతో ఇబ్బంది పడుతున్న హార్థిక్ పాండ్యా ఆడతాడా..? కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ టీమ్లోకి వస్తాడా..? మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఫైనల్ పోరులో కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ కీలకం కానున్నాడు. ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయిన హిట్మ్యాన్.. ఫైనల్ పోరులో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మాన్ గిల్.. గత రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. బంగ్లాదేశ్పై సెంచరీతో చెలరేగిన గిల్.. కివీస్పై మరోసారి దుమ్ములేపాల్సిన అవసరం ఉంది.
తనలో పరుగుల దాహం ఇంకా తీరలేదంటూ విరాట్ కోహ్లీ చెలరేగుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫైనల్ పోరులోనూ అదే ఫామ్ కంటిన్యూ చేస్తే.. టీమిండియా విజయం నల్లేరుపై నడకే.
ఈ టోర్నీలో టీమిండియా విజయాల్లో శ్రేయాస్ అయ్యర్దే కీలక పాత్ర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించడంతోపాటు.. తరువాత గేర్ మారుస్తూ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ పరుగులు సాధిస్తున్నాడు. ఫైనల్ పోరులో అయ్యర్ కోసం కివీస్ కచ్చితంగా స్పెషల్ ప్లాన్ వేసుకుని వస్తుంది.
బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్.. ఆల్రౌండర్గా సత్తా చాటుతున్నాడు. బౌలింగ్లో పర్వాలేదనిపించినా.. బ్యాట్తో చక్కగా రాణిస్తున్నాడు.
ఆసీస్తో పోరులో సిక్సర్తో మ్యాచ్ ముగించిన కేఎల్ రాహుల్.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఫైనల్ పోరులోనూ కేఎల్ రాహుల్ కీలకం కానున్నాడు.
ఫైనల్ పోరులో హార్థిక్ పాండ్యా ఆడడం అనుమానంగా మారడంతో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్లో కండరాల నొప్పులతో ఇబ్బండి పడ్డాడు. ఫైనల్ మ్యాచ్లో ఆడతాడో లేదో అనుమానమే. పాండ్యా దూరమైతే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు. పాండ్యా లేకపోతే బ్యాటింగ్లో కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో రవీంద్ర జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. ఫీల్డింగ్, బౌలింగ్లో రాణిస్తున్నాడు. ఫైనల్ పోరులో జడేజా బంతితో, బ్యాట్తో మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఫైనల్ పోరులో కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. వాషింగ్టన్ సుందర్ టీమ్లోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది.
గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో దుమ్ములేపాడు. సెమీస్లో కీలకమైన హెడ్ వికెట్ తీసి.. మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఫైనల్లోనూ వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టాల్సిందే.
ఈ టోర్నీలో బుమ్రా లేని లేటు కనిపించకుండా బౌలింగ్తో అదరగొడుతున్నాడు షమీ. బంగ్లాపై ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్పై కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఫైనల్ మ్యాచ్లో ఆరంభంలో షమీ వికెట్లు తీస్తే.. కివీస్ కష్టాల్లో పడడం ఖాయం.