New Medical Colleges in AP : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా10 మెడికల్ కాలేజీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈకీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టర్నర్ షిప్ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
1/7ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఆరోగ్య రంగం, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మంత్రివర్గం ఆయుష్మాన్ భారత్ ,ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, వారి ఆర్థిక పరిస్థితి ఏదైనా సంబంధం లేకుండా, సంవత్సరానికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు లభిస్తాయి.
2/7రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు వివరాలు తెలియజేస్తూ, ఈ పాలసీని 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అమలు చేస్తామని వెల్లడించారు. కొత్త హైబ్రిడ్ విధానంలో మొత్తం 3,257 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాక, వైద్య అవసరాల కోసం కేవలం ఆరు గంటల్లోనే అనుమతులు పొందేలా ప్రభుత్వం ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయనుంది.
3/7రూ. 2.5 లక్షల లోపు చికిత్సా ఖర్చులు నేరుగా ఇన్స్యూరెన్స్ కంపెనీల ద్వారా పరిష్కారం అవుతాయి. రూ. 2.5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ భరించనుంది. ఈ కొత్త విధానం రాష్ట్రంలోని 1.43 కోట్ల పేద కుటుంబాలకు మాత్రమే కాకుండా, సుమారు 20 లక్షల ఇతర కుటుంబాలకు కూడా వర్తించనుందని తెలిపారు.
4/7ఆరోగ్య రంగంతో పాటు వైద్య విద్యా రంగానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో వైద్య విద్యకు అవకాశాలు పెంచేందుకు 10 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో ఈ కళాశాలలు రెండు దశల్లో ఏర్పడతాయి. మొదటి దశలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండలో, రెండవ దశలో పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కళాశాలలు నిర్మించనున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన ఆర్ఎఫ్సీ జారీకి కూడా మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
5/7ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను కూడా రాష్ట్ర మంత్రివర్గం అభినందించింది. కొత్తగా మార్చిన జీఎస్టీ స్లాబ్ల ద్వారా నిత్యావసర వస్తువులు, ఆరోగ్య సేవలు, విద్యా రంగం, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు గణనీయంగా తగ్గనున్నాయని మంత్రి పార్ధసారధి తెలిపారు.
6/7ఈ నిర్ణయం పేద ప్రజలకే కాకుండా రైతులు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న ఈ నిర్ణయం "నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణ" గా పరిగణించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది.
7/7మొత్తం మీద, ఆరోగ్య భద్రత, వైద్య విద్యా విస్తరణ, పన్ను సంస్కరణలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముందని ఈ మంత్రివర్గ సమావేశం స్పష్టతనిచ్చింది.