RCB Sale Price: 18 ఏళ్ల ఎదురుచూపుల తరువాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన ప్రముఖ మద్యం కంపెనీ డయాజియో పీఎల్సీ ఆర్సీబీలో తన వాటాను విక్రయించాలని పరిశీలిస్తోంది.
ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్గా విజయ్ మాల్యా ఉన్నారు. అయితే బ్యాంకులకు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ క్లోజ్ అయింది. మాల్యా స్పిరిట్స్ బిజినెస్ను డయాజియో కొనుగోలు చేసింది. అలా ఆర్సీబీ డయాజియో చేతిలోకి ఆర్సీబీ వెళ్లింది.
భారతీయ యూనిట్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా డయాజియోకు ఆర్సీబీలో 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,100 కోట్లు) వరకు వాటా ఉంది. అయితే తమ వాటా అమ్మకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డయాజియో ప్రతినిధి నిరాకరించారు.
ఐపీఎల్లో పొగాకు, ఆల్కహాల్ సంబంధిత బ్రాండ్ల పరోక్ష ప్రకటనలను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్రికెటర్ల ద్వారా అనారోగ్యకరమైన ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ నిలిపివేయాలని ఒత్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ అమ్మకం వాటా వార్తలు వైరల్ అయ్యాయి. డయాజియో ప్రస్తుతం సోడా వంటి ఇతర ప్రొడక్ట్స్ను ప్రచారం చేస్తున్నా.. భవిష్యత్లో ఈ ప్రకటనలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగింది. దీంతో ఫ్రాంచైజీని అమ్మేసి ఎక్కువ లాభాలను అర్జించాలని డయాజియో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో డయాజియో ప్రీమియం మద్యం అమ్మకాలు మందగించాయి.
ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో ప్రపంచ వ్యాపార వ్యూహంపై దృష్టిపెట్టేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఈ వార్తలను డయాజియో అధికారికంగా ధృవీకరించకపోయినా.. బ్లూమ్బెర్గ్ అనే అమెరికా మీడియా సంస్థ మాత్రం ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది.