Govt Announces Big Diwali Gift To Govt Employees In This State: పండుగలు వస్తున్నాయి.. సంవత్సరం ముగుస్తోంది. మరి న్యాయపరంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వాలు ఆలస్యంగా మేల్కొంటున్నాయి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏపై ప్రభుత్వాల్లో కదలిక వస్తోంది. జూలైలో ఇవ్వాల్సిన డీఏను ఇప్పుడు ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో రాష్ట్రం డీఏ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి కరువు భత్యం (డీఏ), పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఆర్ ఇవ్వాల్సి ఉంది. జనవరి, జూలైలో చెల్లించాల్సినవి సమయానికి చెల్లించడం లేదు. ఆలస్యంగా రెండో డీఏను ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా డీఏలు ఇస్తూ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్ అందిస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు తీపి కబురు అందించింది. మూడు శాతం డీఏ చెల్లించేందుకు అరుణాచల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటితోపాటు డీఆర్ కూడా మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పెంచిన డీఏలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి చేరుకోనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డీఏలు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఉద్యోగులు, పింఛన్దారులకు పెంచిన 3 శాతం డీఏ, డీఆర్ ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మూడు నెలలకు సంబంధించిన డీఏను ఏరియర్స్ రూపంలో ప్రభుత్వం చెల్లించనుంది. వీటిని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనున్నట్లు ప్రకటించింది.
పెంచిన డీఏ, డీఆర్ అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగులు, పింఛన్దారులతోపాటు పింఛన్దారుల కుటుంబాలు, డిప్యూటేషన్పై ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా వర్తించనుంది.
డీఏ, డీఆర్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులతోపాటు అఖిల భారత అధికారులకు భారీ ప్రయోజనం లభిస్తుందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు చేశారు.