Tirumala Latest Update : అక్టోబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు దీపావళి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తిరుమలలో కూడా దీపావళి ఉత్సవాలు మొదలైపోయాయి. ఈ క్రమంలో.. పలు సేవలు.. తిరుమలలో దీపావళి రోజు రద్దు చేసింది టీటీడీ. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/6దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో.. అక్టోబర్ 20వ తేదీన దీపావళి ఆస్థానం.. శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ వస్తోంది.
2/6దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు.. గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు ఎదురుగా వేంచేపు అవుతారు. అలాగే సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని స్వామివారి ఎడమవైపున మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు.. ప్రసాద నివేదనలు నిర్వహిస్తారు.
3/6దీపావళి ఆస్థానం అనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. భక్తులు ఈ సందర్భంలో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందుతారు.
4/6అయితే దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20న కొన్ని సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. కల్యాణోత్సవం..ఊంజల్ సేవ..ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఆ రోజున ఉండవు. తోమాల.. అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం.. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం..కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాల్లో కూడా దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానాలు నిర్వహించనున్నారు.
5/6శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి దీపావళి ఆస్థానం జరుపుతారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సహస్ర కలశాభిషేకం సేవ, హనుమంత వాహనసేవను రద్దు చేశారు.
6/6కార్వేటినగరంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు దీపావళి ఆస్థానం..ఆ తరువాత తిరువీధి ఉత్సవం జరగనుంది.