)
Margasiram : చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో సంచరించే మాసం మార్గశిరం. ఈ మాసం సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుదేవుని రూపం. ఈ నెల ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. ఈ నెలతో హేమంతం ప్రారంభం అవుతుంది. భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం" అని వ్యాఖ్యానించారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇక మాసాల్లో తాను మార్గశిర మాసం అన్నాడు. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదమని చెప్పారు. సంధ్యా వందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి.
అందుకే.... మార్గశిర మాసంలోనే సౌర మానంలో వచ్చే ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేయడం అనేది ఆచారంగా వస్తోంది. శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో అరటి దిన్నెలలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయనేది శాస్త్ర వచనం.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో. ఓం నమో నారాయణాయ'అనే మంత్రాన్ని విధిగా స్మరించాలనేది శాస్త్రాలు చెబుతున్న మాట.
ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని , 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలనేది నియమం.
ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు..
మార్గశిర శుద్ధ షష్ఠిని 'స్కంద షష్ఠి’ గా పిలుస్తారు. శివ కుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురున్ని సంహరించాడని అందుకే ఈ తిథి బాలసుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని పిలుస్తారు.
మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున'వైకుంఠ ఏకాదశి'కూడా వస్తుంది. దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు. లేకపోతే పుష్యమాస శుక్ల పక్ష ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి వస్తూ ఉంటుంది. ఈ సారి మార్గశిరంలో కాకుండా పుష్యమాసంలో వస్తోంది.
ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు. ఆ తర్వాత ఉత్తరాయణం ప్రారంభానికి సూచిక.
మోక్షదా ఏకాదశి ... గీతాజయంతి..సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు ఈ మాసంలోనే వచ్చే ఏకాదశి కావడం గమనార్హం. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.
త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు.. అత్రి, అనసూయ దంపతులకు జన్మించింది మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున కావడం గమనార్హం. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్వ్రతం ఆచరించడం ఆనవాయితీ వస్తోంది. అటు మత్స్య ద్వాదశి, ప్రదోష వ్రతం, ఆచరించడం పరిపాటిగా మారింది.
ఈ మాసంలోనే....
అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సు సంక్రాంతినే "ధనుర్మాసం" అని అంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం మార్గశిరం కావడం గమనార్హం.
కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు ఈ మాసాన్ని మించినది లేదు. అటు భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది ఈ మాసం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.