ఆసీస్ రికార్డును సమం చేసిన కోహ్లీ సేన
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ , శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలై.. ఎన్నో మలుపులు తిరిగి ఎట్టకేలకు డ్రాగా ముగిసింది.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ , శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలై.. ఎన్నో మలుపులు తిరిగి ఎట్టకేలకు డ్రాగా ముగిసింది. శ్రీలంక ఆటగాళ్లు తమ బ్యాటింగ్తో ఆకట్టుకొని..బాగా శ్రమించి ఆటను డ్రా దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టాప్ ఆర్డర్ కూలిపోయినా.. శ్రీలంక ఆటగాడు ధనుంజయ డిసెల్వ (111 ) ఎలాంటి తత్తరపాటు లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ స్కోరును పరుగులెత్తించాడు. ఆయనకు తోడు డిక్వెల్లా(44), ఏఆర్ఎస్ సిల్వ (74) కూడా తమదైన శైలిలో ఆడడంతో.. ఎట్టకేలకు శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. మూడవ మ్యాచ్ డ్రా అయినా.. భారత్ 1-0తో సిరీస్ గెలుచుకొని సంబరాల్లో మునిగితేలింది. ఈ సిరీస్ విజయంతో వరసగా తొమ్మిది సిరీస్లు గెలిచి రికార్డు సాధించిన ఆస్ట్రేలియా సరసన భారత జట్టు కూడా నిలవడం విశేషం. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా విరాట్ కోహ్లీయే దక్కించుకోవడం గమనార్హం. మ్యాచ్ అయిపోయాక, టీమిండియా ఆటగాడు జడేజా పుట్టినరోజు వేడుకలను కూడా జట్టు జరుపుకోవడం విశేషం.