)
Ande Sri life story: మాయమైపోతున్న మనిషితనాన్ని తన పదాలతో తిరిగి మేల్కొలిపిన కవి.. అందెశ్రీ (Ande Sri). ప్రకృతి ఒడిలో కూచుని, పదాల పరిమళంతో ప్రజల హృదయాలను కదిలించిన ఈ వాగ్గేయకారుడు, తెలంగాణ సాహిత్యానికి కొత్త ఊపిరి ఇచ్చినవాడు. బలపం పట్టకుండానే అక్షరాలను మనసులో చెక్కుకున్న ఆయన, గుండె నిండా పదాలను కలిపి గీతాలుగా మార్చాడు. తెలంగాణ మట్టి వాసనను తన గాత్రంలో కలిపి, "ధూం ధాం" అంటూ ప్రజా చైతన్యాన్ని తట్టిలేపిన కవి ఆయనే.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య (Ande Yellaiah). 1961 జూలై 18న అప్పటి వరంగల్ జిల్లాలోని (ప్రస్తుత జనగామ జిల్లా) రేవర్తి గ్రామంలో జన్మించారు.నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయనకు పాఠశాల విద్య అందలేదు. చిన్ననాటి నుంచే జీవన పోరాటం మొదలైంది. పశువుల కాపరిగా పనిచేస్తూ ప్రకృతిని, మనిషి బాధను గమనించడం ఆయన కవిత్వానికి పునాది అయింది. నిజామాబాద్లో తాపీ పనులు నేర్చుకునే రోజుల్లో శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ ఆయనకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చి, అందెశ్రీ అనే పేరును ప్రసాదించారు. ఆ పేరే తరువాత ఆయన జీవితాన్ని కవిత్వంగా మార్చింది.
ఒక దశలో జీవితం భారంగా అనిపించి ఆత్మహత్య ఆలోచనకు కూడా వెళ్లారు. కానీ ఆ సమయంలో దర్శకుడు యలమంచి శేఖర్ ఆయనను ప్రోత్సహించి, సినిమాల్లో పాటలు రాయడానికి అవకాశం ఇచ్చారు. అలా అందెశ్రీ సినీ రంగంలో అడుగుపెట్టారు. విప్లవ దర్శకుడు నారాయణమూర్తి సినిమాల్లో అనేక గీతాలు రాశారు. అయన రాసిన “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” పాట ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల తెలుగు పాఠ్యాంశాల్లో చోటు సంపాదించింది.ప్రపంచంలోని మిస్సిసిప్పి, నైల్, అమెజాన్, మిస్సోరీ వంటి మహానదుల ఒడిలో ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాయాలని ఆశపడ్డ ఆయన కవిత్వం ప్రకృతి గుండె చప్పుళ్లను ప్రతిబింబిస్తుంది. 2003లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. అదే సమయంలో కామారెడ్డిలో జరిగిన "తెలంగాణ ధూం ధాం" సభలో ఆయన మనకంటూ ఒక గీతం ఉండాలనే ఆలోచనకు వచ్చారు. అలా పుట్టింది “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” అనే గేయం.
మొదటిసారి 2003 నవంబర్ 11న ఆదిలాబాద్లో ఈ పాట పాడినప్పుడు, ప్రజల హృదయాలు కదిలిపోయాయి. ఆ గీతం తరువాత తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ గేయాన్ని ప్రభుత్వం అధికారిక రాష్ట్రగీతంగా గుర్తించింది. ఈ పాటలో 12 చరణాలుంటాయి. ప్రతి చరణం తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు జిల్లాలు 33 అయినా, అందెశ్రీ సృష్టించిన ఆ గీతం ఇప్పటికీ తెలంగాణ ప్రజల హృదయాలలో అదే ఉత్సాహంతో మార్మోగుతుంది.
2006లో "గంగ" చిత్రానికి గాను ఉత్తమ గేయరచయిత నంది అవార్డు ప్రదానం చేసింది ప్రభుత్వం. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వాషింగ్టన్ D.C.లోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నుంచి లోకకవి బిరుదు లభించింది. దాశరథి సాహితీ పురస్కారం (వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, 2015), డా. రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015), తెలంగాణ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుకు ప్రతిపాదించింది. అనాథ బాల్యం నుంచి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన కవి అందెశ్రీ జీవితం, కష్టాలను కళగా మలచిన స్ఫూర్తిదాయక గాథ. ఆయన గీతాలు తెలంగాణ మట్టి వాసనతో, ప్రజల హృదయస్పందనతో శాశ్వతంగా మార్మోగుతూనే ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook