Andhe Sri Songs: తెలంగాణ నేల గుండెలో శాశ్వతంగా ముద్ర వేసుకున్న పేరు అందెశ్రీ. కవిత్వం ఆయనకు చదువుతో రాలేదు.. జీవనంతో వచ్చింది. బడికెళ్లని, బలపం దిద్దలేదు. కానీ.. పదాన్ని పద్యంగా మలచిన అద్భుతమైన గేయరచయిత ఆయన. ప్రజల హృదయాలకు దగ్గరైన ఈ ప్రజాకవి గుండెపోటుతో కన్నుమూసిన వార్త సాహిత్య జగత్తుకే కాదు, తెలంగాణకే పెద్ద లోటు. తెలంగాణ ఆత్మను పదాల్లో మలచిని వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన అద్భుత పాటలు చూద్దాం.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన విద్యా అవకాశాలు లేకపోయినా, జీవనానుభవాలే ఆయనకు గురువులయ్యాయి. గొర్రెలను మేపుతూ, పొలాల్లో నడుస్తూ, పల్లెల వాతావరణం ఆయనలోని కవిని మేల్కొలిపింది. ఆయన పదాల్లో కనిపించే తెలంగాణ జానపద రుచీ, మట్టి వాసన, మనిషితనం కలగలసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయి.
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ఇచ్చిన పాటల స్ఫూర్తి అంతులేనిది. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ గీతం ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఆ గేయం కేవలం పాట కాదు.. తెలంగాణ ప్రజల గౌరవానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. అదే గీతం ఈ రోజు రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందడం ఆయన కృషికి నిజమైన గౌరవం.
అందెశ్రీ పదాల తీరే వేరుగా ఉండేది. కవిత్వాన్ని చదవలేదు, కానీ జీవించాడు. మాటల్లో ఉన్న మాంత్రికతే ఆయన బలం. ఆ తీరును మనం ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాటలో చూసుకోవచ్చు. ఈ పాటలో మనిషి మనసు, మానవత్వం, కాలపు మార్పులు అన్ని ఒకే గీతలో మిళితమై ఉంటాయి. ఈ పాట ఆయనను తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలబెట్టింది.
ఆయన రాసిన మరో ప్రేరణాత్మక గీతం ‘జనజాతరలో మన గీతం’, తెలంగాణ ఉద్యమానికి చైతన్యం నింపిన పాటగా నిలిచింది. ఆ కాలంలో ఈ గీతం ప్రతి సభలో, ప్రతి ఊరిలో వినిపిస్తూ ప్రజలలో ఉద్యమ స్పూర్తి రగిలించింది. అలాగే ‘ఊరు తెలంగాణ… నా పేరు తెలంగాణ’ పాట ఆయన తెలంగాణ గర్వాన్ని వ్యక్తం చేసిన గేయరత్నం.
Also Read: Ande Sri Journey : పశువుల కాపరి నుంచి డాక్టరేట్ వరకు అందెశ్రీ ప్రస్థానం ఇదే..!!
ప్రకృతిపై ప్రేమ, పల్లె జీవన సౌందర్యం కూడా ఆయన పాటల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘పల్లెనీకు వందనాలమ్మా’ అనే పాట ఆయన గ్రామీణ సంస్కృతిని, పల్లెల గౌరవాన్ని కీర్తిస్తూ రాశారు. రసమయి బాలకృష్ణ స్వరపరచిన ఈ పాట పల్లె ఆత్మను ప్రతిబింబిస్తుంది. అదే విధంగా ‘గల గల గజ్జలబండి, ఘల్లూ చూడు’ అంటూ తన స్వస్థలమైన ఓరుగల్లును వర్ణించిన పాటలో ఆయన మట్టిపట్ల ప్రేమ స్పష్టంగా వినిపిస్తుంది.
ఇవే కాదు, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’, ‘ఎల్లిపోతున్నావా తల్లి’, ‘చూడు తెలంగాణ’, ‘అల్లంత దూరం చూడు’, ‘ఆడ బ్రతుకు’ వంటి ఎన్నో గీతాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి. ప్రతి గీతం వెనుక ఒక భావం, ఒక కదిలించే సత్యం దాగి ఉంటుంది.
అందెశ్రీ జీవితమే ఒక కవిత్వం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే .. మాయమైపోతున్న మనిషికోసమే నా కవితాగమనం. ఆ మనిషితనాన్ని పదాల్లో మలిచి, తెలంగాణ స్ఫూర్తిని సాహిత్యంలో నిక్షిప్తం చేసిన ఈ మహాకవి ఇక లేరు. కానీ ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ మాయమవ్వవు. ఆయన రాసిన ప్రతి పదం, ప్రతి గీతం మన భూమి, మన భాష, మన భావజాలానికి శాశ్వతమైన జ్ఞాపక చిహ్నంగా ఉన్నాయి..ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









