Telengana MLC Elections: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటులో పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. సిట్టింగ్ సీటు కావడం పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని అధిష్ఠానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పాలని ఆదేశించింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయలేదని అర్థమవుతోంది.. ఆయనకు సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు జోరుగా ప్రచారం వినిపిస్తోంది..
ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మంత్రులు, నలుగురు ఇంఛార్జి మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతిచ్చారని ప్రచారం ఉంది. అటు ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జులను సైతం నియమించింది. మరోవైపు బీజేపీ నలుగురు ఎంపీలు ఉండటం వారిలో ఒకరు కేంద్ర మంత్రి అయినందున గట్టిగా పోరాడతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలసి వ్యూహం రచించాలని సీఎం రేవంత్రెడ్డి ముందే సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రులు, ఇతర నేతలు వెన్నుపోటు పోవడం కారణంగానే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారనే చర్చ జరుగుతోంది.
అంతేకాదు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకం ఉండనుంది. దాంతో ఆశావహులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తారని తొలుత అందరూ భావించారు. కానీ వారు కూడా పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు వచ్చే మెజార్టీనే ఎమ్మెల్యేల పనితీరుకు గీటురాయిగా పరిగణిస్తామని పార్టీ ముందే అంతర్గతంగా చెప్పినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే హెచ్చరించినా నేతలు పట్టించుకోలేదని సమాచారం. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో సైతం నేతలు సరిగా పనిచేయలేదనే గాంధీభవన్లో చర్చ జరుగుతోందట.
మరోవైపు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేషన్ రౌండ్ తో పెద్దగా ప్రయోజనం జరగలేదన్నారు. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలు తనవే అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు లీడర్ షిప్ అవసరం ఉందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లాలో మైనస్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పై ఒక రిపోర్ట్ ను అధిష్టానానికి అందిస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. డీసీసీ పదవి తనకు వద్దని స్పష్టం చేశారు.
మొత్తంమీద అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోందట. అధికార పార్టీ అయ్యూండి కూడా సిట్టింగ్ సీటును జార విడుచుకోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యినట్టు తెలుస్తోంది. దీనికి బాధ్యులైన కొందరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీ లీడర్లు సహకరించకపోవడం వెనుక నరేందర్ రెడ్డి కూడా గుస్సా మీద ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు..
Also Read: BCCI New Rules: ఐపీఎల్ ఆటగాళ్లకు బిగ్ అలర్ట్, ఈ రూల్స్ పాటించాల్సిందే
Also Read: Old Pension Scheme: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్ప్రైజ్ బొనాంజా.. ఓపీఎస్పై కీలక ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









