Letter To Sonia Gandhi: తెలంగాణలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు, మోసాలపై రేవంత్ రెడ్డి వైఫల్యాలను వివరిస్తూ మహిళా నాయకులు సోనియా గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు.. పరిష్కారంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి పాలనపై లేఖలో ఫిర్యాదు చేశారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను బానిసత్వం వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ మహిళలు, తల్లులు, అక్కాచెల్లెళ్లకు క్షమాపణ చెప్పించాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు.
Also Read: KTR: గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ తప్పు ఒప్పుకోవాలి: కేటీఆర్
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి లేఖ రాశారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అవమానకర సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళలకు కాళ్లు కడిగించడం వంటి సంఘటనలు రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను బానిసత్వం వైపు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని మండిపడ్డారు.
Also Read: Kavitha Politics: సొంత పార్టీ పెడతారని పుకార్లు.. కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం
'18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడుగడుగునా మోసం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తీరు మార్చుకోవాలి' అని లేఖలో మహిళా నాయకులు సూచించారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు తెలంగాణ మహిళలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన పని ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనమని ప్రకటించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంతులేని దుఖాన్ని కలిగించిన ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి రాసిన లేఖలో వివరించారు.
'రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులను నియంత్రించాలి. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన రేవంత్ రెడ్డి పనితో ప్రజల మనసును తీవ్రంగా బాధించింది. మహిళా సాధికారత పేరిట ఇలాంటి పనులను చేయించడం ప్రభుత్వ దిగజారుడు వైఖరికి నిదర్శనం. ఈ చర్యలు తెలంగాణ సంప్రదాయాలను అవమానించడమే కాక ప్రపంచం ముందు తెలంగాణ ఖ్యాతిని మంటగలిపాయి' అని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
'స్వాభిమానానికి తెలంగాణ మహిళలు నిదర్శనం. వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డల కాళ్లు మొక్కడం ఈ నేల సంప్రదాయం' అని సోనియా గాంధీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుచేశారు. 'తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం అనేది తెలంగాణ సంప్రదాయం కాదు. రేవంత్ రెడ్డి వికృత వ్యక్తిత్వానికి సాక్ష్యం' అని మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి అజ్ఞానం, ఎవరినో సంతోషపెట్టడానికి ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దాస్య మనస్తత్వాన్నే చూపిస్తున్నాయి' అని లేఖలో వివరించారు. తెలంగాణ తల్లులు, అక్కాచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter









