Telangana Politics: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో గులాబీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు తుంగతుర్తిలో రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ను కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పటివరకు గులాబీ పార్టీలో కొనసాగిన సామేల్.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను పక్కన పెట్టేసినా హైకమాండ్ సామేల్కు టికెట్ ఇవ్వడంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ.. ఇప్పుడు మందుల సామేల్ సొంత పార్టీ లీడర్ల నుంచే తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పాత కొత్త అంటూ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. దాంతో ఏం జరుగుతుందోనని కేడర్ మొత్తం టెన్షన్ పడుతోంది.
తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మండలం సదర్శాపురంలో ఎమ్మెల్యే సామేల్ పర్యటించారు. సదర్శాపురం గ్రామ బిక్కేరు వాగులో చెక్ డ్యామ్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేసేందుకు ఆయన వెళ్లారు. దాంతో ఎమ్మెల్యే ముందే కొత్త పాత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు గొడవకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు కార్యకర్తలకే ఎమ్మెల్యే సామెల్ ప్రాధాన్యత ఇస్తున్నారని. ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పాత లీడర్లు ప్రశ్నించారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని గత ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని సామేలును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని ఇప్పుడు తమను కాకుండా కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలు లేకుండా ఎమ్మెల్యే సామెల్ ఒక్కరి ఫోటోనే ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇరువర్గాల నాయకులు కార్యకర్తలు పరస్పరం దూషించుకుంటూ వాగ్వివాదానికి దిగారు. దాంతో తనకేమీ పట్టనట్టుగా ఎమ్మెల్యే మందుల సామేల్ గోదావరి జలాలకు పూజలు చేసే వెళ్లిపోవడం చర్చనీయాశంగా మారింది.
ఇటీవల తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలోనూ వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే సామేల్ సూచించన వ్యక్తిని కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాత కాంగ్రెస్ లీడర్కు పదవి ఇవ్వాలని సిఫార్స్ చేశారట. దాంతో తన ఇలాకాలో మంత్రి పెత్తనం ఏంటని ఎమ్మెల్యే సామేల్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలిసింది. ఇతర పోస్టుల విషయంలోనూ మందుల సామేల్ వలస లీడర్లకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు అరోపించారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ.. ఇటీవల మోత్కురులోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ నాయకులందరినీ కలుపుకొని పోవాలని నేతలు కోరారు. లేనిపక్షంలో ప్రతి పర్యటనను అడ్టుకుంటామని అప్పుడే హెచ్చరించారు. అన్నట్టుగా మరోసారి ఎమ్మెల్యే సామేల్ను సొంత పార్టీ లీడర్లే ఇప్పుడు అడ్డుకోవడం హాట్ టాపిక్గా మారింది.
మొత్తంగా సొంత పార్టీ లీడర్ల నుంచే నిరసనలు ఎదురవుతుండటంతో.. మందుల సామేల్ పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది. అయితే తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. దళితుడిని అయినందుకే తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆరోపిస్తున్నారట. తన విషయంలో పార్టీ హైకమాండ్ కల్పించుకుని పాత లీడర్లను కూల్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. చూడాలి మరి మందుల సామేల్ విషయంలో పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవుతారా.. లేక కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే ఈ వ్యవహారాన్ని వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Atmiya Bharosa: మహా శివరాత్రికి తెలంగాణ ప్రభుత్వం కానుక.. కూలీలకు నిధులు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









