
Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణపై డైలామా నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో నేతలంతా బోరుమంటున్నారు. బుగ్గకారులో తిరుగుదామని ఆశపడ్డ కొందరు నేతల ఆశలపై హైకమాండ్ నీళ్లు చల్లి.. మరికొద్ దిరోజులు వేచి చూడాలని చెప్పడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవులు ఇస్తారంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. మరొక ఎమ్మెల్యే అయితే తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా నేతలంతా పార్టీ హైకమాండ్ను టార్గెట్ చేయడంతో.. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. శంషాబాద్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. మంత్రి వర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. పార్టీ ప్రభత్వ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ అన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఇక ఇదే సమావేశంలో భువనగిరి ఎంపీ చామలకిరణ్కు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రోజుకో మంత్రి పేరు ప్రకటన చేస్తున్నావని.. ఎందుకలా ప్రకటనలు అంటూ మండిపడినట్టు తెలిసింది. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించారట. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ విషయం అధిష్టానమే చూసుకుంటుందని.. కానీ మీరే ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. ఇంకోసారి మంత్రి వర్గ విస్తరణ పై ముందస్తు కామెంట్స్ చేయొద్దని సూచించినట్టు తెలిసింది.
ఇక్కడే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలిసింది. పార్టీలో ఎవరైనా అద్దంకి దయాకర్ మాదిరిగా ఓపికగా ఉండాలని చెప్పారు. అద్దంకికి ముందు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని అనుకున్నాం.. కానీ కుదరలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నాం అది కుదరలేదు. అయినా ఓపికతో అద్దంకి ఉన్నాడు కాబట్టే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడని ప్రశసించారట. అంతేకాదు అద్దంకి దయాకర్ తన జీతంలో 10 శాతం ఏఐసీసీకి టీపీసీసీకి 15 శాతం ఇస్తున్నారని గుర్తు చేశారట. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే అద్దంకి దయాకర్పై ప్రశంసలు కురిపించడతో.. ఎమ్మెల్యేలు తమ జీతంలో నుంచి పార్టీకి 20 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే పార్టీ, సీఎల్పీకి పదివేల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీకి ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. కొద్దిరోజులుగా తనకు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హైకమాండ్కు వార్నింగ్ ఇస్తున్నారు. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలపైన విరుచుకుపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వచ్చి చేరారు. ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఆయనకు మంచిర్యాల ఎమ్మల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మంత్రి పదవి కోసం ఇద్దరు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి, రాజ్గోపాల్ రెడ్డి సీఎల్పీ భేటీకి రాకపోవడం దుమారం రేపుతోంది. దీంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని పార్టీ పెద్దలు ఆరా తీసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.