Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసినా కూడా రాహుల్ గాంధీ ఆశయాల కోసం పని చేస్తానని కాంగ్రెస్ బహిష్కృతి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తాను నమ్ముకున్న బీసీ వాదం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా కూడా భయపడేది లేదని.. అవసరమైతే మరోసారి కుల గణన పత్రాలు చించుతానని తెలిపారు. బీసీల కోసం తాను ఉద్యమం చేస్తానని చెప్పారు.
Also REad: Adilabad CCI: కేటీఆర్ తీవ్ర విమర్శలు.. 'బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం'
కాంగ్రెస్ పార్టీ సస్పెండ్పై బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. 'కాంగ్రెస్ సస్పెన్షన్ ఆర్డర్ అందింది. రేవంత్ రెడ్డి చాలా రోజుల నుంచి నన్ను సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే నడిపించడానికి బీజం మీరే వేశారు' అని తెలిపారు. 'రేవంత్ రెడ్డి గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఉన్న బీసీలు తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని నడిపారు. బీసీలపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటే ఇక పోరాటమే చేస్తాం. కానీ భయపడే ప్రసక్తే లేదు' అని చింతపండు నవీన్ కుమార్ వెల్లడించారు.
Also Read: Banakacherla Project: గురువు చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. బనకచర్లపై అభ్యంతరం
తాను చేసిన తప్పు ఏమిటో చెప్పాలని తీన్మార్ మల్లన్న నిలదీశారు. 'ఒక వేళ తప్పుడు సర్వే ప్రతులను కాల్చడం తప్పు అనిపిస్తే అదే తప్పును నేను మళ్లీ చేస్తా. ఎందుకంటే అది పూర్తిగా వివక్షతో కూడుకున్న తప్పు సర్వే. కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉంటే తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలి' అని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూ కోట ప్రకారం రిజర్వేషన్ మీ ఇష్టం వొచ్చినట్టు ఇస్తే ఆ అన్యాయాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. కుల గణన సర్వే తప్పు.. ఇది నిరూపించడానికి ఎక్కడికయినా వస్తా నిరూపిస్తా అని సవాల్ చేశారు.
బాధ్యతయుత పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి బీసీలకు అన్యాయం జరుగుతుంటే సరిదిద్దుకోవాలని సూచించినట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. 'కాంగ్రెస్ పార్టీలో అగ్ర వర్ణాలకు మాత్రమే అంతర్గత భద్రత ఉంటుంది. కానీ బడుగు బలహీన వర్గాలపైనే మీరు చర్యలు తీసుకుంటారా' అని ప్రశ్నించారు. 'టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇలాగేనా మాట్లాడేది అని నల్లగొండ నాయకులు అంటున్నారు. ఎవరు నన్ను గెలిపించలే. నల్గొండవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి నేను గెలిపించుకున్నా' అని తీన్మార్ మల్లన్న తెలిపారు. మహబూబ్నగర్లో మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేక పోయారని ప్రశ్నించారు.
'బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం. రేపటి నుంచి రోజు ఒక కార్యాచరణ తీసుకొని బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. నేను ఏ పార్టీ లోకి వెళ్లడం, పార్టీ పెట్టడం మీద దృష్టి పెట్టలేదు. బీసీ వాదానికి కట్టుబడి మాత్రమే నేను పని చేస్తా. బీసీలను కించపరిచే చర్యలపై అందరం కలిసి పోరాటం చేస్తాం' అని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









