
Suravaram Sudhakar Reddy Passes Away: సురవరం సుధాకర్ రెడ్డి కొంత కాలంలో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ మణికొండలో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్రెడ్డి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారు. కార్యకర్తల సందర్శన తర్వాత గాంధీ మెడికల్ కళాశాలకు అందజేయనున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి.. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగారు. మూడు పర్యాయాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు కాగా...సురవరం ప్రతాపరెడ్డి ఆయన పెదనాన్న. సుధాకర్రెడ్డి సొంతూరు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. ఆయన తన అమ్మమ్మగారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25న జన్మించారు. కర్నులులో విద్యాభ్యాసం చేశారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు ఆలోచనలు ఆయన్ను ఆకర్షించాయి.
సురవరం సుధాకర్రెడ్డి కి 18 ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1960లో AISF కర్నూలు జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అంచెలంచెలుగా పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. 1962లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజులపాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూలులో బీఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ నుంచి LLB డిగ్రీ పొందారు. తర్వాత హైదరాబాద్ లా కాలేజీలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. ఆ ఎన్నికల అనంతరం ఆయన AISF రాష్ట్ర అధ్యక్షుడిగా చేపట్టారు. 1970లో ఆయన AISF , 972 AIYF జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
సురవరం సుధాకర్రెడ్డి 1974 నుంచి 1984 వరకు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి విజయ్భాస్కర్రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1988లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అలానే 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచే రెండోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలో పొత్తులో గెలిచారు. ఇక 2000లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా కూడా పని చేశారు. ఇక 2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో సిపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018 కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న వైదొలిగారు.
పలు ఉద్యమాలకు సురవరం సుధాకర్ రెడ్డి నాకత్వం వహించారు. 2000 సంవత్సరంలో హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో సురవరం సుధాకర్రెడ్డిది కీలక భూమిక పోషించారు. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సీపీఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సుధాకర్రెడ్డి ప్రధానపాత్ర పోషించారు.
సురవరం సుధాకర్రెడ్డి మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురవరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జాతీయస్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ప్రజాపోరాటాల్లో పాల్గొన్నారని ఆయన సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన మృతిపై BRS అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పోరాడే వారన్నారు. తెలంగాణ మట్టి బిడ్డ సురవరం అంటూ కీర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కేసీఆర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.