Electricity Phone Number in Telangana: కరెంటు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే కరెంటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో 1912 విద్యుత్ అంబులెన్స్ సేవలు, విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశారని తెలిపారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని మొదటి దశ నుంచి ఏడవ దశ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. 10 సంవత్సరాలపాటు పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు, విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించినా పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఎనర్జీ పాలసీ లేక గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పాలన కాలంలో 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 డిమాండ్ వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 2000 మెగావాట్ల డిమాండ్ అదనంగా ఏర్పడినా రెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు వెల్లడించారు.
కరెంటు వాడకం పెరిగినా ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. "రాష్ట్రంలో 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని.. 2034-35 నాటికి 33,773 మెగా వాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చింది. భవిష్యత్తు డిమాండ్ కు రెట్టింపు విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటినుంచే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ - 2025 తీసుకువచ్చాం. లక్ష కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి ఒప్పందాలు చేసుకున్నాం. 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన 29 వేల పంపు సెట్లకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం 11,500 కోట్లు వెచ్చిస్తుంది.
200 యూనిట్ల వరకు అర్హులైన వారికి గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.71 లక్షలకు పైబడి పేదలు లబ్ధి పొందుతున్నారు. వారి పక్షాన ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు 2,293 కోట్ల రూపాయలు చెల్లింపు చేస్తున్నాం. రాష్ట్రంలోని 29,018 ప్రభుత్వ విద్యాసంస్థలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందుకుగాను ఆర్థిక శాఖ విద్యుత్ సంస్థలకు 198 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. మొత్తంగా నిరుపేదలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు, ఏదో బిడ్డలు చదువుకుంటున్న ప్రభుత్వ విద్యా సంస్థలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు మొత్తంగా ప్రతి సంవత్సరం ఉచిత విద్యుత్ పథకాలకు 13,992 రూపాయలను ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం.." అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 108 మాదిరిగా విద్యుత్ శాఖలో 1912 సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే వినియోగదారులు ఎక్కడి నుంచైనా 1912 కు కాల్ చేస్తే ఒక ఇంజనీరు, రిపేరు చేసే వ్యక్తి, ట్రాన్స్ఫార్మర్, నిచ్చెన, విద్యుత్ వైర్లతో కూడిన అంబులెన్స్ కొద్ది నిమిషాల్లో మీ ప్రాంతంలో ఉంటుందన్నారు. ఇది అంబులెన్స్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా విద్యుత్ సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని అభినందించారు. భారీ వరదలు, పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నారని వివరించారు. ఉద్యోగులకు ఏ సమస్యలు ఉన్న వినడానికి అధికారులు ఉన్నారు. ఆపైన విద్యుత్ శాఖ మంత్రిగా తాను ఎప్పుడు అడిగితే అప్పుడు సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒక ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది కాదన్నారు. విద్యుత్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో భద్రత చర్యలు తప్పకుండా పాటించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Also Read: ఆ విధంగా చిరంజీవిపై పై చేయి సాధించిన మోహన్ బాబు.. అసలు కథ ఇదే..
Also Read: భీకర స్థాయికి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం.. అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









