
Telangana Politics: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ఒక వెలుగు వెలిగిన మహిళా నేత రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లా పొలిటికల్ సర్కిల్లో ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది.. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుతో వచ్చిన రెండవ సార్వత్రిక ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు జిల్లా పర్యటనలు చేసి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని భావించిన అధిష్టానం టికెట్ సర్దుబాటు చేయకపోవడంతో పోటీచేయలేదని ఆమె అనుచరులు చెబుతుంటారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సోనియాగాందీ కుటుంబంతో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా నియమించారు. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె జిల్లాలో పర్యటించిన సందర్భాలు కనిపించాయి. అటు ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి జిల్లాను పర్యటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పి దాదాపు సంవత్సరం దాటింది. ఈ హామీ ఇచ్చిన తర్వాత ఎంపీ రేణుకా చౌదరి ఒక్కసారి కూడా జిల్లాకు రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది..
ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్లో రేణుకా చౌదరికి ప్రత్యేక వర్గం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉండి కూడా జిల్లాలో పర్యటించకపోవడంతో రకరకాలుగా చర్చ నడుస్తోంది. గతంలో జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరి అనేలా వర్గపోరు ఉండేది.. దీంతో ఆధిపత్యపోరుతో నిత్యం ఆ పార్టీలో ఆసక్తికరమైన రాజకీయాలు ఉండేవి.. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉండడంతో ఎవరి వర్గం వారికి ఉందన్న ప్రచారం ఉంది. దీంతో వారి మధ్యలో వెళ్లి రేణుకా రాజకీయాలు చేయలేక జిల్లాకు వెళ్లలేక పోతున్నట్లు సమాచారం.
మరోవైపు జిల్లాలో ఆమె అవసరం లేదని అధిష్టానం వద్ద మంత్రులు కూడా తేల్చిచెప్పడంతో రేణుకా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో రేణుకా వర్గంగా చెప్పుకుని కాంగ్రెస్ను అంటిపెట్టుకుని ఉన్నవారు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఆమె జిల్లాకు రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని అంటున్నారు. ముగ్గురు మంత్రులతోనూ ఆమెకు పోసగడం లేదన్న టాక్ ఉంది. అయితే రాజ్యసభ సభ్యురాలిగా ఉండి కూడా జిల్లా మంత్రుల పట్యటనలో ఆమె ఇప్పటి వరకు పాల్గొనకపోవడం రకరకాలుగా చర్చ జరుగుతోంది..
మొత్తంమీద ఎంపీ రేణుకా చౌదరి తన క్యాడర్ ను కాపాడుకోవడం కోసమైనా జిల్లాలో పర్యటించాలని ఆమె అనుచరులు కోరుకుంటున్నారు. కానీ ఆమె జిల్లా మంత్రులతోనూ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లాలో రేణుకా ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా తన వారి కోసం రంగంలోకి దిగుతారా లేదంటే.. ఆ మంత్రులతో మనకేందుకులే అని ఆమె సరిపెట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook