Meenakshi Natarajan Strategy: తెలంగాణ కాంగ్రెస్లో ప్రక్షాళన షురువైంది. పార్టీ లైన్ లైన్ దాటిన లీడర్లపై కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం తోనే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. గతనెల వరంగల్లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. ఈ తర్వాత కూడా రెడ్డి సామాజికవర్గం మల్లన్న వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Jagadish Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెండ్
ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన చర్యలపై వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొంటున్నారో చెప్పాలని కోరింది. ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ ఆయన.. స్పందించలేదు. తన వివరణ ఇవ్వలేదు. అంతేకాకుండా.. షోకాజ్ నోటీస్ తర్వాత కూడా పార్టీ లైన్ దాటుతూనే ఉన్నారు. దాంతో ఆయన తీరు పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దీనికితోడు కొందరు నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ హైకమాండ్పై ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తీన్మార్ మల్లన్నపై పార్టీ హైకమాండ్కు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షీ తీన్మార్ మల్లన్న ఏపిసోడ్ను పట్టించుకోకపోవడంతో తీన్మార్ మల్లన్న మరింత రెచ్చిపోయారు. కానీ దీపాదాస్ను తప్పించి కొత్త ఇంచార్జ్గా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించడంతో.. ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Also Read: Revanth Reddy: 'కేసీఆర్ చేయనన్ని పాలసీలు నేను చేశా.. ఫొటోలు దిగాల్సిన అవసరం లేదు'
ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమించాక.. మీనాక్షి నటరాజన్ హైదరబాద్ చేరుకున్నారు. వచ్చి రాగానే గాంధీభవన్ లో టీపీసీసీ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీనాక్షి సింప్లిసిటీ చూసి నేతలంతా షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న నేతల లిస్టును తన వద్దకు మీనాక్షి నటరాజన్ తెప్పించుకున్నట్టు సమాచారం. అంతేకాదు మీనాక్షి నటరాజన్ దగ్గర తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు లోతైన చర్చ జరిపారని తెలిసింది. అయితే తీన్మార్ మల్లన్న పార్టీని ఇంతలా డ్యామేజ్ చేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోలేదని టీపీసీసీ నేతలపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని టీపీసీసీని ఆమె ఆదేశించారట. దాంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తీన్మార్ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు... పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
మొత్తంగా తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ఇచ్చినట్టు అయ్యిందనే చర్చ జరుగుతోంది. ఇకమీదట పార్టీ గీతదాటి మాట్లాడే నేతలకు మల్లన్న సస్పెషన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. మరోవైపు మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే తన మార్క్ చూపించారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అటు మున్ముందు ఇంకెంత మందిపై వేటు పడుతుందోనని కాంగ్రెస్ లో తిరుగుబాటు నేతలు టెన్షన్ పడుతున్నట్టు చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









