
BRS Party Elkathurthy Meeting: 'ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా కేసీఆర్ మార్చారు. వలసలు వాపస్ తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను బీఆర్ఎస్ పార్టీ ఎగరేసింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేశాం. ప్రజలకు ఏ కష్టమొచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే చూస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా తెలిసింది' అని వివరించారు.
వరంగల్లోని ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లను శనివారం పార్టీ నాయకులతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'వరంగల్లోని ఎల్కతుర్తి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఎడ్ల బండ్లు, వాహనాలు, సైకిల్, పాదయాత్రగా తరలి వస్తున్నారు. కేసీఆర్ చూడాలి.. ఆయన ప్రసంగం వినాలని దండుగా వస్తున్నారు' అని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని ప్రకటించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
'కొత్త పథకాలు లేవు. ఉన్న పథకాలు బంద్.. స్కాలర్ షిప్స్ బంద్, బతుకమ్మ చీరెలు బంద్, కేసీఆర్ కిట్టు బంద్' అని బీఆర్ఎస్ పార్టీ సీనయర్ నాయకులు హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ శృతి లేని.. గతి లేని ప్రభుత్వమైందని విమర్శించారు. తాము సంపద పెంచి పేదలకు పంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక అన్ని రకాల ఆదాయాలు తగ్గాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన వైఫల్యంతో నేడు రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని.. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ అమలు చేయలేదని.. అసెంబ్లీలో మాట చెప్పి తప్పిన చరిత్ర రేవంత్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 'రాష్ట్రంలో రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు. రైతు రాజ్యం అంటే బీఆర్ఎస్ పార్టీ పాలన' అని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా రైతుల ఖాతాల్లో నగదు వేసిన ప్రభుత్వం మరొకటి లేదని ప్రకటించారు. రుణమాఫీ బంద్, రైతుబంధు బంద్, సాగునీరు కాదు తాగునీళ్లు కూడా లేవు' అని విమర్శించారు. కృష్ణా నదిలో నీళ్లున్నా కూడా పంటలు ఎండ బెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఎల్కతుర్తి బహిరంగ సభకు ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ జామ్ చేసి సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందని తెలిపారు. 'రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహిస్తున్న సభ ఇది. సభ విజయవంతంగా జరిగేందుకు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe