)
Harish Rao Vs Kavitha: తనపై కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు పరోక్షంగా స్పందించారు. బీఆర్ఎస్కు సుప్రీం కేసీఆర్ అని.. ఎవరి విషయంలో అయినా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసిగట్టుగా పనిచేయడం.. ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. లండన్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు.. ఎన్ఆర్ఐ యూకే బీఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్తో ముచ్చటించారు. ఎన్నారై సెల్ చైర్మన్ అనిల్ కుర్మాచలం లేని లోటు కనిపిస్తోందని.. 2012-13 లో తాను మొదటిసారి వచ్చినప్పుడు అనిల్ మొదటి ఎన్ఆర్ఐ మీటింగ్ తనతోనే ఇక్కడ ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్లోనేనని.. యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందని అన్నారు.
"కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించింది. అప్పుడు దేశంలో నానుడి ఉండేది. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేది.. కానీ కేసీఆర్ గారి పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే కాడికి తెచ్చాం.. గత పదేళ్లలో గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. పర్ క్యాపిటా పవర్ వాడకంలో ఇండియాలో తెలంగాణ టాప్. జీఎస్డీపీ గ్రోత్లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్. మేనిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్లికపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్.
మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారు. తెలంగాణ రాకముందు హైదరాబాదులో ఇండస్ట్రీస్కి పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు కరెంటు కట్టు ఉండేది. గ్రామీణ ప్రాంతంలో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది. అరవై ఏళ్లలో కాని పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉదయం లేవగానే పవర్ పై సమీక్ష చేసి పవర్ కొనుగోలు టైమ్స్ ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఆయన ఫోకస్డ్గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని సర్దార్ కోచలాని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు.. వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు కానీ రైతు అని అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. వ్యవసాయం అంటే చిన్నచూపు అయింది. అలాంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి సంవత్సరం 10000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి అందించారు.. సాగునీరుని అందించాము దాని ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారింది.
2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదు.. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదు.. ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు.. కేసీఆర్ గారు తెలంగాణ ఓ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పేవారు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో ఈరోజు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఏ శాఖలో చూసిన అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం.. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుంచి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. యావరేజ్ రైన్ ఫాల్ ఉన్న సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడి నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి.. ఎంత ఇబ్బంది వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి..
కాళేశ్వరంలో 141 టీఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్.. ఇక్కడి నుంచి మూసికి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. 7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లను మూసికి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి..? గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు.. అక్కడికి సోర్స్ కాళేశ్వరం మల్లన్న సాగరే కదా.. కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి..? మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదు.." అని హరీష్ రావు హితవు పలికారు.