
Harish Rao Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి తాను అడ్డు చెప్పానని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు స్పందించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని.. ఎన్నికలు జరిగితే వంద సీట్లతో అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ను సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటామని హరీష్ రావు అన్నారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటామన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని పోలీస్, ఇతర అధికారులను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విరుచుకుపడ్డారు. "12 వేల కోట్లు నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్.. మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించాని వార్తలు వస్తున్నాయి. వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలి. సచివాలయాని అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోలో సమీక్షలు చేస్తున్నావా.. రేవంత్ రెడ్డి." అంటూ మండిపడ్డారు.
"బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. పార్టీ పెట్టిన నాడు జై తెలంగాణ పదాన్ని నిషేదించిన పరిస్థితి. 25 ఏండ్ల క్రితం పరిస్థితి ఎట్లుండే బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయి..
వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. కేసీఆర్ గారు పట్టుబట్టి, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి పోయి రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు జరుపుతున్నాడు అంటే దానికి కేసీఆర్ కారణం.
కేసీఆర్ లేకుంటే ఈరోజు వేడుకలు జరిగేవా..? ఆనాడు ఉసిల్ల లెక్క పార్టీలు పుట్టినయి, ఆ తర్వాత అంతరించినయి. కేసీఆర్ ధనవంతుడు కాడు, బలవంతుడు కాడు, కేసీఆర్కు ఉన్నది గుండె బలం. రాజీలేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్.
తెలంగాణ ప్రజాసమితి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 11 ఎంపీలు గెలిచాం.. ఆనాటి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా కాలరాసింది. మలి దశ ఉద్యమంలో సోనియా గాంధీ చేత తెలంగాణ ఇచ్చే పరిస్థితి తెచ్చిండు కేసీఆర్. సంకీర్ణ యుగం అనే వ్యూహంతో పార్టీ పెట్టి నడిపించిండు. చంద్రబాబును ఎదుర్కొనేందుకు నాడు ఎవరు దైర్యం చేయలేదు. ఎన్డీఏ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది జార్ఖాండ్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్. జయశంకర్ సారు సహా అందరూ కేసీఆర్ ను ముందుండి నడువు మని ధైర్యం చెప్పారు. ఆలోచన చేసి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవులకు రాజీనామా చేసి 2001లో పార్టీ ఏర్పాటు చేసిండు. ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, అంబేద్కర్ చూపిన మార్గం బోధించు సమీకరించు పోరాడు మార్గంలో ఉద్యమం నడిపిండు.
కేసీఆర్ సహా మేమందరం రాజీనామా చేస్తే.. ఆనాడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిండు. బీజేపీ అధ్యక్షుడు ఆనాడు రాజీనామా చేయలేదు. నేటి ముఖ్యమంత్రి ఆనాడు రాజీనామా చేయలేదు
ఈరోజు వాళ్లు కేసీఆర్ను విమర్శిస్తారా..? బీఆర్ఎస్ లేకుంటే, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. ఆనోళ్ల తోనే శభాస్ కేసీఆర్ అనేలా అద్భుతమైన పాలన చేసిండు కేసీఆర్. కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే, రేవంత్ అబద్దాలలో అగ్రగామిగా నిలుపుతున్నడు. మహిళలకు 21వేల కోట్ల వడ్డీ లేని రుణం అని ఈరోజు కూడా అబద్దాలు మాట్లాడిండు. నువ్వు జీవో చూపించు.. ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నా..
60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చింది పది వేలు దాటలేదు. నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు పెట్టింది కేసీఆర్. 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతున్నావు. ఎవరి వల్ల సాధ్యమైంది. కేసీఆర్ వల్ల సాద్యమైంది. నీ ఏడాది పాలనలో నువ్వు చేసిందేమిటి రేవంత్ రెడ్డి..? ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చినవా, ఒక్క ప్రాజెక్టు కట్టినవా, ఒక్క చెక్ డ్యాం నిర్మించినవా, ఒక్క చెరువు తవ్వినవా..? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా రేవంత్ రెడ్డి. దివాళా దివాళా అని దిక్కుమాలిన ప్రచారం చేసిండు. ఎవడు దివాళా అంటడో వాడే దివానా గాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డడు రేవంత్. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ప్రజలు క్లియర్గా ఉన్నరు, ఈరోజు ఎన్నికలు జరిగితే వంద సీట్లలో అధికారంలోకి వస్తం.." అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.