Fire Accident in Park Hyatt: హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తుల్లో మంటలు ఎగిసిపడగా.. భారీగా పొగలు అలుముకున్నాయి. హోటల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. విద్యుత్ వైర్లు కాలడంతోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
కాగా.. ఇదే హోటల్లో సన్రైజర్స్ టీమ్ ఆటగాళ్లు బస చేస్తున్నారు. హోటల్లో ప్రమాదం సంభవించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్లోని పర్యాటకులు, టూరిస్టులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని హోటల్ సిబ్బంది తెలిపారు.









