
Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ మరికొన్నాళ్లు కొనసాగాల్సిందే. కరువు భత్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించడం లేదు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా డీఏలు తెలంగాణలో అత్యధికంగా పెండింగ్ ఉన్నాయి. ఇవ్వాల్సిన ఐదు డీఏలు ఇప్పట్లో ఇచ్చేట్టు కనిపించడం లేదు. ఇటీవల పలు బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సర్దుకుపోవాలని.. సహకరించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రావాల్సిన పెండింగ్ డీఏలు కూడా ఇప్పట్లో రావని స్పష్టమవుతోంది.
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరువు భత్యం (డీఏ) విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరికి సంబంధించి రెండు శాతం డీఏను ప్రకటించింది. అయితే రాష్ట్రంలో మాత్రం పెండింగ్లో ఉన్న డీఏలు మొత్తం ఐదు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తే డీఏ 26.39 శాతం మాత్రమే ఉంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జనవరి నుంచి డీఏ పెండింగ్లో ఉంది. 2022, జులై 3.64 శాతం, 2023 జనవరి 3.64 శాతం, జూలై 3.64 శాతం మూడు డీఏలను పెండింగ్లో ఉండగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో రెండు డీఏలు చేరాయా.ఇ 2024 జనవరి 3.64 శాతం, జులై 2.73 శాతం, ఈ ఏడాది జనవరి 2.73 శాతం డీఏ పెండింగ్లో ఉన్నాయి. అయితే 2022 జూలైకి సంబంధించిన 3.64 శాతం డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పెండింగ్ డీఏలు ఐదు ఉన్నాయి.
ప్రస్తుతం ఐదు డీఏలు కలిపి 16.38 శాతం పెండింగ్లో ఉంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందోనని ఉద్యోగులు, పింఛన్దారులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇక ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు రూ.8 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వచ్చేనెల నుంచి నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ఇక 2023 జూలై ఒకటి నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. పీఆర్సీ కూడా ఆలస్యమయ్యేలా పరిణామాలు ఉన్నాయి. ఇప్పటికే పీఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. ఒకవైపు డీఏలు, ఇంకోవైపు పెండింగ్ బిల్లులు, మరోవైపు పీఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికితోడు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు కూడా రావడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, పింఛన్దారులు, ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలు విధాలుగా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలిపారు. ఎన్నికల్లో ఉద్యోగులకు కూడా మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోక వచ్చాక వారిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగ వర్గాలన్నీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe