)
OPS Latest Update: పెన్షన్ ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించిందని.. గౌరవ ప్రథమంగా జీవించే హక్కులో భాగమే పెన్షన్ అని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఫిక్స్ డ్ పెన్షన్, ఫిక్స్ డ్ పే మెంట్ వంటి మౌలిక తేడాలున్నాయని.. మార్కెట్లోని ఆటుపోట్లను బట్టి మన పెన్షన్పై గ్యారెంటీ లేదన్నారు. ఉద్యోగి పెన్షన్ పెట్టుబడిదారుల చేతిలో ఉందన్నారు. పెన్షన్ను ఒక హక్కుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ సభలోని అంశాలను ప్రభుత్వానికి చేర్చుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే గతంలో చీఫ్ సెక్రటరీకి ఓ నివేదిక సమర్పించామన్నారు. మన సమస్యపై కసరత్తు చేయాలని.. ప్రభుత్వంపై పడుతున్న భారంపై కసరత్తు చేయాలని అన్నారు. సీపీఎస్ ఉద్యమానికి తన వంతు మద్దతు ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. "ఈ సమస్య పై ఇప్పటికే గవర్నర్ తో పాటు అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నూతన పెన్షన్ విధానంకు ఒప్పుకోవడం వలన సీపీఎస్ అమలు జరుగుతుంది. నాకు ఓట్లు వేసి గెలిచిన ఉపాద్యాయులకు రుణపడి ఉంటాను. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఓపీఎస్ కోసం ప్రభుత్వాన్ని ఒప్పిద్దాము. లేదంటే.. సీపీఎస్ రద్దు కోసం పోరాడుదాము.." అని అన్నారు. "ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలి. ఉద్యోగికి పెన్షన్ భిక్ష కాదు, హక్కు. పీఆర్పీ, డీఏ లు పెండింగ్ లోనే ఉన్నాయి.." అని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అశ్వద్దామ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 1వ తేదీ ఉద్యోగులకు విద్రోహ దినం. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదు కనీస హక్కు. సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానంను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సీపీఎస్ లో లోపాలు ఉన్నాయి కాబట్టి యూపీఎస్ ను తీసుకువచ్చారు. అనేక క్లిష్ట పరిస్థితులను పరిష్కరిస్తున్న సీఎం ఓపీఎస్ ను కూడా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓపీఎస్ అమలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఇదే సెప్టెంబర్ 1వ తేదీ సీపీఎస్ ఉద్యోగులకు చివరి విద్రోహా దినం కావాలి. మన సమస్యను మానవీయ కోణంలో పరిష్కరిస్తోందని ప్రభుత్వంపై నమ్మకం ఉంది. రెవెన్యూ శాఖకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చినట్లుగానే సీపీఎస్ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్న.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతుతో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేసిన పాత పెన్షన్ సాధనకై సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను నిర్వహించాం. దీంతో 2004 సెప్టెంబర్ 1 తరువాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని వర్తింపచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక వృద్దాప్యంలో ఆర్ధిక, అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు." అని అన్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు కె.రామకృష్ణ మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని (UPS) నిర్ద్వందంగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1980 పెన్షన్ రూల్ ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి ఉద్యోగుల ఆత్మగౌరవంను కాపాడాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ లేకుండానే పదవి విరమణ తర్వాత సర్వీస్ ను బట్టి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఉద్యోగంలో ఉండి చనిపోయిన లేదా పదవి విరమణ తర్వాత చనిపోయిన కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ ఒడిదుడుకుల మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడమన్నది ఎండమావిలో నీటిని వెతకడమే అవుతుంది.
ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత ఉంటేనే వృద్దాప్యంలో వారు ఆత్మ గౌరవంతో జీవిస్తారు. పాత పెన్షన్ ప్రకటన కోసం రెండున్నర లక్షలపై చిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేటికి పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ,జార్ఖండ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానంను అమలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణకు సిద్దమవుతున్నాయి.." అని అన్నారు.