)
TSRTC Bus Fire Hike: 'అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్కు పిలుపునిస్తే అందరినీ ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం. ఇది అప్రజాస్వామీకం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం సందర్భంగా మెహిదీపట్నంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి మోసాలు వివరించారు. ఈ సందర్భంగా ఛార్జీల పెంపుతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. '20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు. ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ రెడ్డి దొంగ దెబ్బ కొట్టిండు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
'వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజల రక్తం పీల్చుతున్నాడు. మెట్రో రైలును ఆగం చేశాడు. కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా? ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవరూ అడగొద్దు అన్నట్లు ఉంది. ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నాడు' అని మండిపడ్డారు.
'మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ? టికెట్ ధరల పెంపుపై బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా? తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు.
'ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం.. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కమిషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చేయాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook