)
Telangana BJP: తెలంగాణ బీజేపీలో వర్గపోరు సద్దమణగడం లేదు. పార్టీలో కొందరు నేతలు వలస నేతలను పట్టించుకోవడం లేదు. కొత్తవారికి పదవులు ఇస్తామని హైకమాండ్ ముందుకొచ్చినా సీనియర్లు అడ్డుకుంటున్నారనే టాక్ ఉంది. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చివరి వరకు ప్రచారం జరిగింది. అధిష్టానం ఈటెల పేరును ప్రకటించే సమాయానికి అనూహ్య మార్పు జరిగింది. ఈటల స్థానంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పార్టీ క్యాడర్ ను పరుగులు పెట్టిస్తున్నారు.. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది..
గత పార్లమెంటు ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా గెలిచారు. అక్కడ పార్టీకి బలమైన కేడర్ లేకపోయినా.. బీజేపీ హవాలో ఆయన విజయం సాధించారు. ఎప్పుడైతే ఎంపీగా విజయం సాధించారో ఆ తర్వాత కాస్తో కూస్తో ఉన్న క్యాడర్ను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గత పార్లమెంటు ఎన్నికలకు జిల్లా ముందు జిల్లా అధ్యక్షుడిగా సదానందారెడ్డి కొనసాగారు. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కాగానే.. ఆయన్ను తప్పించి.. రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించేలా చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. అప్పట్లో నాన్ లోకల్ నేత అయినా రాజశేఖర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వెనకేసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయనే జిల్లా అధ్యక్షుడిని పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా బీజేపీలో గ్రూపుల పంచాయితీ ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తాజాగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ పర్యటకు వెళ్లారు. అక్కడ జీఎస్టీ తగ్గింపుపై ఆర్ అండ్ బీ గేస్ట్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా పార్టీ నేతలంతా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కాస్తా ఆలస్యంగా వచ్చిన బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలోకి జిల్లా అధ్యక్షుడు రాకుండా డోర్ బంద్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే డోర్ తీసుకొని సమావేశ మందిరం లోపలికి వెళ్లేందుకు డోర్ తీసిన రాజశేఖర్ రెడ్డికి.. బయటే ఉండమని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈ సమావేశం ముగిసే వరకు డోర్ వద్దే నిల్చోని ఉన్న అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి.. సమావేశం అనంతరం ఎంపీని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ సమావేశం నుంచి బయటకు రాగానే.. కనీసం జిల్లా అధ్యక్షుడిని పట్టించుకోకుండా వెళ్లిపోయడం సంచలనంగా మారింది. అయితే ఎంపీ తీరుపై సొంత పార్టీ నేతలే ఇప్పుడు గుస్సా అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యవహారం పార్టీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజులుగా కమలం పార్టీలో నేతల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్గా పంపించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీ నేతలపై తన అసంతృప్తిని తెలియచేయడానికే ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చాడని ప్రచారం జరిగింది. పార్టీలో కొందరు నేతలు కావాలనే తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే బీజేపీ కార్యకర్తలపై కూడా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డాడు. మీకు కార్యకర్తలు అవసరం లేదా అని ఓ నాయకుడు ప్రశ్నించగా, కార్యకర్తలతో పనిలేదని చెప్పడం సంచలనం రేపింది. ఆ లొల్లి సద్దుమణగక ముందే.. మరోసారి హాట్ టాపిక్ గా మారారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook