)
Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోడానికి బీఆర్ఎస్ పార్టీ తమకున్న అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తాచాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.రాష్ట్ర రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉండటంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని పరువు కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రత్నించడం పక్కన పెడితే.. జూబ్లీహిల్స్ గెలిస్తే రేవంత్ రెడ్డిపై విజయం సాధించినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. అటు బీజేపీ కూడా చివర్లో దూకుడు పెంచి పొలిటికల్ హీట్ మరింత పెంచే ప్రయత్నం చేసింది.
మెజారిటీ ఓట్లను సాధించి ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. షెడ్యూలు విడుదలగాక ముందు నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు విషయంలో ముందడుగువేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండో భార్య సునితను బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది.
కార్యకర్తల సమావేశాలు, ఇంటింటికీ ఎన్నికల ప్రచారం విషయంలో బీఆర్ఎస్ దూసుకు పోతోంది. సానుభూతి ఓట్లతో మళ్లీ గట్టెక్కాలని చూస్తూనే… కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనే ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలు పెట్టింది. తెలంగాణ రాజకీయాల్లో ఉనికిని చాటుకోడానికి బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యంతో ఎన్నికల్లో తలపడుతోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
పదేళ్లపాటు అధికారంలో ఉండి.. తెలంగాణలో ఇక తిరుగేలేదనే భావనలో ఉన్న బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సారథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నికల ఫలితాలకు ముందే ప్రమాణ స్వీకార తేదీని డిసైడ్ చేసుకున్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఏర్పాటు తదనంతర పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రభుత్వ సారథిగా రేవంత్ రెడ్డి మరుసటి రోజునుంచే ఎన్నికల హామీలను అమల్లోకి తెచ్చామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఒక్కటే అమల్లోకి తెచ్చారు. ఏదో కొంత మంది 200 యూనిట్స్ వరకు ముందు ఫ్రీగా ఇచ్చినా.. ఆ తర్వాత దాని ఊసే లేదు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిదారులు తమను గట్టెక్కిస్తాయని భావిస్తోంది.
రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన మరు క్షణంనుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాపై ధ్వజ మెత్తుతూ బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావన కల్పించారు. ప్రతి సమావేశంలోనూ బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు.బీఆర్ఎస్ పార్టీని చులకనచేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కాంగ్రెస్ పాలనాతీరును ఎండగట్టారు కేటీఆర్.
హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం విభిన్నప్రాంతం. భౌగోళికంగా… సామాజికంగా.. రాజకీయంగా.. ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతం. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసం ఉండే వారికంటే.. పరిసరాల్లో నివాసం ఉండేవారి ఓటింగ్ తో ఎన్నికల ఫలితాలను నిర్థారిస్తాయి. ముఖ్యంగా యూసఫ్ గూడ, కళ్యాణ్ నగర్, మారుతీనగర్, క్రిష్ణానగర్, బోరబండ, ఫిల్మ్ నగర్, ఎల్లారెడ్డిగూడ, షేక్ పేట, ఓయూ కాలనీ, హైమావతి నగర్,జనప్రియ మెట్రో పొలిస్, ఫాతిమా నగర్, యునాని ఆస్ప్రత్రి, సంజయ్ నగర్ పరిసరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. సంపన్న వర్గాలు ఖరీదైన బంగళాల్లోనూ… రెక్కాడితేగాని డొక్కాడని పేద వర్గాలు మురికివాడల్లో నివాసం ఉంటున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు అత్యధికులుగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎన్నికలు ప్రధాన పార్టీలకు చావో రేవో అన్నట్టుగా మారాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందినవారికంటే...ఇక్కడ జరిగే అభివృద్ధిపైనే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతాయని చెప్పవచ్చు. కాలనీలు, బస్తీల్లో ఉండే మహిళాపొదుపు సంఘాలు ప్రభుత్వంనుంచి వడ్డీలేని రుణాలు తీసుకోవడం, బ్యాంకులకు తిరిగిచెల్లించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వంనుంచి ప్రయోజనం పొందిన రైతులు లేరు.
రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు కావోస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది. అది నిజమని జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో రుజువుచేయాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటములు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపుతాయన్న అంచనాలున్నాయి. జూబ్లీహిల్స్ స్థానంలో గెలిచి సొంతసీటును కాపాడుకుందామనే కంటే.. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
అటు బీజేపీ రంగంలోకి రెండు పార్టీలు.. నాణానికి బొమ్మా బొరుసు అనే టైపులో ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీలు ముస్లిమ్ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ప్రస్తావిస్తూ మెజారిటీ హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన అంటే ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే కుట్ర చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలను ఎంఐఎం ఆడించినట్టు ఆడుతున్నాయనే కామెంట్స్ ప్రజల్లో బలంగా తీసుకెలుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి.. పాకిస్తాన్ ముడ్డి మీద మన తన్నిందనే కామెంట్స్ ప్రజల్లో నెగిటివ్ గా వెళ్లాయి. ఓ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అభ్యర్ధి కనీస జ్ఞానం లేకుండా ఓట్ల కోసం ఎలా పడితే అలా మాట్లాడుతారా అనే విషయాన్ని బీజేపీ మాత్రమే ప్రస్తావిస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హైడ్రా విభాగ పనితీరును కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఓ అస్త్రంగా ఎంచుకున్నారు. కారుకు బుల్డోజరుకు మధ్యసాగుతున్న పోరుగా కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కారు కావాలో… బుల్డోజరుకావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రతికార్యకర్త తానే కేసీఆర్ అనే భావనతో పనిచేయాలని కోరారు. హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సునిత తన భర్తపై అభిమానాన్ని, సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలని అక్కడక్కడా భావోద్వేగానికి గురవుతూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న నవీన్ యాదవ్... గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడుకావడం, గతంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీతరఫున కాలనీ వాసులతో మంచి పరిచయాలున్నాయి. యువ నాయకుడిగా సామాజిక సేవా కార్యక్రమాలతో మరింత చేరువకావడంతో నవీన్ అభ్యర్థిత్వం పట్ల ప్రజల్లో ప్రత్యేక అభిప్రాయమే తమను గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. ప్రజావిశ్వాసంతో ఈ ఎన్నికల్లో విజయం తథ్యమనే భావన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లో వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ దిమ్మతిరిగే సమాధానం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
హోరాహోరీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునిత సానుభూతి ఓట్లతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్ధంపట్టే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారా? బండి సంజయ్ రాకతో బీజేపీ చివర్లో దూకుడు పెంచడంతో పోటీ అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరి ఓట్లను అనే విషయం ఓటర్ల చేతుల్లో ఉంది. నవంబరు 11వ తేదీన జరిగే పోలింగ్ రోజున ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారోనని...అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.