)
Ktr Vs Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. బండి సంజయ్ కుమార్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై కూడా కేటీఆర్ ఈ దావాను దాఖలు చేశారు. తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు గాను.. ప్రసారం చేసినందుకు గాను ఈ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో బండి సంజయ్ పైన రూ. 10 కోట్ల పరువు నష్టానికి కేసు వేశారు. తన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తొలగించాలని, మరియు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తన న్యాయవాది పి. విశ్వ జననీ ద్వారా ఈ కేసును నమోదు చేసిన కేటీఆర్.. తన ఫిర్యాదులో ముఖ్యంగా బండి సంజయ్ వ్యాఖ్యలను పేర్కొన్నారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో.. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SBI) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, మరియు ఆర్థిక అవకతవకలకు తనను ముడిపెట్టారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను పలు తెలుగు టీవీ ఛానెల్స్తో పాటు నేషనల్ ఛానెల్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్లు మరియు ఎక్స్, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలలో విస్తృతంగా ప్రసారమయ్యాయని ఫిర్యాదులో కేటీఆర్ పేర్కొన్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించినవన్నారు కేటీఆర్. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని తెలిపారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో "విపరీతమైన నిందారోపణలతో నీచమైన దుష్ప్రచారానికి" పాల్పడ్డారని కేటీఆర్ ఈ ఫిర్యాదులో ఆరోపించారు. అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల.. ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ ఫిర్యాదు నొక్కి చెప్పింది.
తన పరువు నష్టం దావా కేసులో భాగంగా కేటీఆర్.. బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, మీడియా పోర్టల్ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక ఈ కేసును హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook