)
KTR Fires On Hydra: పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని గతంలో స్పష్టంగా చెప్పిందని.. అయినా గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని.. రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి బుల్డోజర్తో వస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని అన్నారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారని.. కాంగ్రెస్ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయిందని.. రెండేళ్ల చేసిందేమి లేదన్నారు. బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని.. పెద్దల ఇళ్లకు వెళ్లదన్నారు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువులపై ఇళ్లు కట్టినా వాటిని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఆదివారం, శనివారం వస్తేనే పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేశాం, 42 ఫ్లై ఓవర్లు కట్టినం. రాహుల్ గాంధీకి ఇవి కనపడవు. రేవంత్ రెడ్డి జెండా కాంగ్రెస్, ఎజెండా బీజేపీది. బుల్డోజర్లను అక్కడ వ్యతిరేకిస్తారు, ఇక్కడేమో అదే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. హిందువులు, ముస్లింలు అని మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క పంచాయతీ కూడా కాలేదు.కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది..? పదేళ్లు జోరుగా నడిచిన పాలన ఇప్పుడు ఆగం అయ్యింది. కేసీఆర్ లక్ష ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అప్పు పుట్టట్లేదు అని ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తారా? రాష్ట్రానికి సీఎం ఇలా మాట్లాడతారా..? దొంగను దొంగ లెక్కనే చూస్తారు.
ఇంతమంది సీఎంలను చూశాం, కానీ ఇతని లాగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఇస్తామన్న హామీలు అడిగితే నన్ను కోసుకు తింటారా అని అంటున్నారు. నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రి ఇలా అంటారా..? అంత కరోనా టైమ్లో ఏ పథకం ఆపలేదు. అన్నీ మనం కట్టిన వాటిని ప్రారంభిస్తున్నారు. మనం కట్టిన ఫ్లై ఓవర్లకు సున్నం వేస్తున్నాడు. జేబులో కత్తెర పట్టుకొని మనం కట్టిన వాటిని ప్రారంభిస్తున్నాడు. జూబ్లీహిల్స్లో గుద్దుడు గుద్దితే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. అడ్డంగా సంపాదించిన డబ్బులు రేవంత్ దగ్గర, కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్నాయి. ప్రజల్లో కోపం ఉంది. గతంలో 4,700 మెజారిటీ వచ్చింది, ఈసారి 10 వేలు దాటాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్లో ఉచిత మంచి నీళ్లు ఆపేస్తాడు. అందుకే జూబ్లీహిల్స్, జీహెచ్ఎంసీ ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలి.
నిన్న మోదీ వచ్చి ఏదో చెప్తాడు అనుకున్నాం. హెచ్1బీ వీసా గురించి మాట్లాడుతాడు అనుకున్నాం. జీఎస్టీ పండగ చేసుకో అని చెప్తున్నారు. మొన్నటి దాకా రక్తం తాగి ఇప్పుడు తగ్గించి పండగ చేసుకో అంటున్నారు. గ్యాస్ ధర నాడు 450 ఉంది, ఇప్పుడు వెయ్యి దాటింది. ఎనిమిదేళ్లు గుంజి డబ్బులు ఇస్తే, లేదంటే పదిహేను లక్షలు ఇస్తామన్నది ఇస్తే పండగ చేసుకుంటాం. ముడి చమురు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.. ఎలా పండగ చేసుకోవాలి? రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ..? మతం పేరు మీద రాజకీయం చేయటం మాత్రం వచ్చు మోడీకి, బీజేపీకి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తుంది. మీరు తప్పిదారీ ఓటు వేయొద్దు.అడ్డగోలు పైసలు కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఉన్నాయి, వచ్చి ప్రమాణం చేసి ఓటు వేయాలని అడుగుతారు. కాంగ్రెస్ వాళ్లను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి.." అని కేటీఆర్ అన్నారు.