)
Telangana Land Scam: భారీ అవినీతికి తెరలేపి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన లేఖ రాశారు. రేవంత్ రెడ్డి అవినీతి, భూ కుంభకోణం అని చెబుతూ దీనిపై చర్యలు తీసుకుంటారా? మౌనంగా ఉంటారా? అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. మౌనంగా ఉంటే మీ అంగీకారంతోనే ఈ కుంభకోణం జరిగిందని భావించినట్లు అవుతుందని పేర్కొన్నారు.
'ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో రూ.లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు పక్కా ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 'పరిశ్రమల తరలింపు ప్రధాన లక్ష్యం అయితే ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేకంగా ప్రభుత్వం భూముల ట్రాన్స్ఫర్ కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల తరలింపుకు ఎలాంటి గడవు నిర్ధారించకపోవడం, అసలు పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశాన్ని ప్రకటించకపోవడం వంటి అనేక లోపభూయిష్టమైన పాలసీని కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకువచ్చారు' అని లేఖలో కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని, ఈ భూముల బదిలీతో కలిగి ఆవరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని లేఖలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. దీనివల్ల హైదరాబాద్లో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
'కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ గ్రూపులు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు, కుటుంబసభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా హిల్ట్ పాలసీ రూపొందించారు' అని రాహుల్ గాంధీకి లేఖలో కేటీఆర్ వివరించారు. వీరందరికీ నామమాత్రపు ధరకి రాజధాని హైదరాబాద్లోని అత్యంత విలువైన భూములను పొందడానికి రూపొందించిన పాలసీ అని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు అవినీతి కోసం డబ్బుల కట్టల కోసం తీసుకువచ్చిన ఈ పాలసీ ముమ్మాటికి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేయడమే అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిబంధనలు తొలగించి రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులకు ఏటీఎంగా మార్చేశారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సంపదను దోచుకోవడానికి ఈ పాలసీని రూపొందించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి కేటీఆర్ రెండు కీలక ప్రశ్నలు సంధించారు. పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న రూ.5 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే 5 లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు. తను రాస్తున్న ఈ బహిరంగ లేఖకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా ఉంటుందా లేదా? ప్రజల ఆస్తులను దోచుకుంటున్న తమ పార్టీ నాయకులకు అండగా నిలబడేలా మౌనం మాత్రమే సమాధానంగా వస్తుందా? అన్నది ప్రజలు గమనిస్తారు' అని రాహుల్ గాంధీకి రాసిన లేఖను కేటీఆర్ ముగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook