BRS Party: 'మీక్కావాల్సింది ఇదేగా.. ఇగ చూసుకోరి'.. జోష్‌ పెంచిన కేసీఆర్‌ ప్రసంగం

BRS Party Silver Jubilee KCR Speech Live Updates: రెండున్నర దశాబ్దాల రాజకీయ యవనికపై అద్భుత పాత్ర పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవం చేసుకుంటోంది. ఈ సందర్భంగా హన్మంకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బాహుబలి సభ దేశ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ బహిరంగ సభ లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 27, 2025, 08:04 PM IST
BRS Party: 'మీక్కావాల్సింది ఇదేగా.. ఇగ చూసుకోరి'.. జోష్‌ పెంచిన కేసీఆర్‌ ప్రసంగం
Live Blog

BRS Party Silver Jubilee Meeting: బీఆర్‌ఎస్‌ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీగా కొనసాగుతోంది. ఉద్యమ పార్టీ.. అధికార పార్టీ.. ప్రతిపక్షం ఇలా మూడు పాత్రల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తికి వెళ్లే మార్గాలన్నీ గులాబీమయంగా మారింది. కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు? తదుపరి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాచరణ వంటి లైవ్‌ అప్‌డేట్స్‌ తెలుసుకుందాం.

27 April, 2025

  • 20:04 PM

    బహిరంగ సభ వేదిక నుంచి పోలీసులపై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. 'పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?' అని ప్రశ్నించారు. 'మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి. ఇది ఆపడం ఎవరితరం కాదు' అని కేసీఆర్‌ ప్రకటించారు. 'ఇక నుంచి నేను బయలుదేరతా.. ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం' అని తెలిపారు.

    కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వమని గులాబీ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. 'విద్యుత్‌ సరఫరా, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లు, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేనిలో పాస్‌? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 'అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం.. 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని' కేసీఆర్ ఆరోపించారు.

  • 19:43 PM

    హైడ్రాపై కేసీఆర్‌ విమర్శలు
    తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారని కేసీఆర్ తెలిపారు. 'నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతుంది' అని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతారు' అని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారు. హెచ్సీయూ భూములను ఎవరైనా అమ్ముతారా? భూములను అమ్మవచ్చు.. అయితే ఏ భూములను అమ్మాలనే విచక్షణ ఉండాలి కదా' అని హెచ్‌సీయూ అంశంపై కేసీఆర్ స్పందించారు.

  • 19:34 PM

    ధగధగలాడే తెలంగాణను చేశా
    'అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించా. ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నాం' అని కేసీఆర్‌ తెలిపారు. ‘1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశా. కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పా' అని కేసీఆర్‌ గుర్తుచేశారు. 

    '60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్నారు' అని కేసీఆర్‌ తెలిపారు.

  • 19:03 PM

    పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నతల్లి.. జన్మభూమిపై భావోద్వేగంగా కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామాయణ ఇతివృత్తాన్ని కేసీఆర్‌ వివరించి దానిని తెలంగాణ పరిణామాలకు అనుసంధానం చేశారు.

  • 19:03 PM

    పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నతల్లి.. జన్మభూమిపై భావోద్వేగంగా కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామాయణ ఇతివృత్తాన్ని కేసీఆర్‌ వివరించి దానిని తెలంగాణ పరిణామాలకు అనుసంధానం చేశారు.

  • 18:59 PM

    సభ నివాళి
    జమ్మూకశ్మీర్‌లోని పహల్గమ్‌ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ నివాళి అర్పించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 28 మందికి నివాళిగా కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు, లక్షలాదిగా హాజరైన ప్రజలు, ఉద్యమకారులు మౌనం పాటించారు.

  • 18:57 PM

    అమరులకు నివాళి.. తెలంగాణ తల్లికి వందనం
    బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వేదికపైకి గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు చేరుకున్నారు. లక్షలాది ప్రజలు తరలిరాగా.. వేల సంఖ్యలో ఇంకా బారులు తీరిన ప్రజలు ఉండడంతో కొద్దిసేపు కేసీఆర్‌ వేచి చూశారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించారు. సభా వేదికపైకి చేరుకున్న కేసీఆర్‌ మొదట అమరవీరుల స్తూపం.. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు.

  • 18:27 PM

    పోలీసులపై తీవ్ర ఆరోపణలు
    రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను రాకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తదితరులు బహిరంగ సభ వేదికగా పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా తమ శ్రేణులను ఆపుతున్నారని.. ఎల్కతుర్తికి వచ్చే మార్గంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని గులాబీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. 'ఇది మంచి పద్ధతి కాదు. పోలీసులకు మంచి పేరు ఉందని అది చెడగొట్టుకోవద్దు' అని ఎర్రబెల్లి దయాకర్‌ రావు హెచ్చరించారు.

  • 17:42 PM

  • 17:21 PM

    ఎల్కతుర్తి నలువైపులా ట్రాఫిక్‌ జామ్‌
    బీఆర్‌ఎస్‌ పార్టీ బాహుబలి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజలతో వరంగల్‌ దారులు వాహనాలతో నిలిచిపోయాయి. ఎల్కతుర్తి నలువైపులా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు అన్నివైపులా 20 నుంచి 22 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ తలెత్తింది. పోలీసులు.. ప్రత్యేక భద్రతా దళాలతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వాలంటీర్లు వాహనాలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • 17:18 PM
    • సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బయల్దేరడానికి సిద్ధమయ్యారు. కొన్ని నిమిషాల్లో ఎల్కతుర్తి బహిరంగ సభ వేదిక వద్దకు రానున్నారు.

    కళాకారులతో ఫుల్‌ జోష్‌
    ఎల్కతుర్తి బహిరంగ సభకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో వరంగల్‌ రహదారులు వాహనాలతో నిండిపోయాయి. ఇప్పటికే చేరుకున్న ప్రజలతో బహిరంగ సభ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభా వేదికపై కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు. ఆటాపాటలతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపుతుండగా జై తెలంగాణ నినాదాలతో ఎల్కతుర్తి మార్మోగుతోంది.

  • 16:05 PM

    ఎల్కతుర్తి  బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభ అప్‌డేట్స్

    గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్

    5.30 గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్‌లో ప్రారంభమవుతారు.

    6 గంటలకు ఎల్కతుర్తి బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్న ఎలిప్యాడ్ కు చేరుకుంటారు

    6.15 నుంచి 6.45 వరకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం 

    7 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు

    7 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం 

    7.40 వరకు కేసీఆర్‌ ప్రసంగం ఉండే అవకాశం ఉంది.

    మొత్తంగా 40 నిమిషాలు కేసీఆర్ స్పీచ్ ఉంటుంది.

  • 16:00 PM

    సభ ఏర్పాట్లు
    హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు.

    రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వచ్చే అవకాశం ఉంది. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టమ్‌ను ఉంచారు.

    బహిరంగ సభ వివరాలు
    మొత్తం విస్తీర్ణం: 1,213 ఎకరాలు
    సభా ప్రాంగణం: 154 ఎకరాలు. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ఏర్పాటు
    పార్కింగ్‌: 1,059 ఎకరాలు. పార్కింగ్‌ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్ల నియామకం

    10 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
    వేసవి నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో అత్యవసర వైద్య బృందాలు ఉండనున్నాయి. ఆయా రూట్లలో 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు.
    1,200 తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు

  • 15:50 PM

    టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌ చరిత్ర ఇదే
    తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 25 వసంతాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టిన గడ్డ విముక్తి కోసం అనేక పోరాటాలు.. ఉద్యమాలు బీఆర్‌ఎస్‌ పార్టీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిదిన్నర ఏళ్లపాటు సుపరిపాలన అందించి దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి దిక్సూచిగా నిలిపారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో 2.05% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అనంతరం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ సమయంలో జరుగుతున్న ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా  పదిహేడు నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.
     
    ప్రతిపక్ష పార్టీగా విజయవంతం
    తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27వ తేదీన ఏర్పడిన నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ రూపాంతరం చెంది 25 ఏళ్ల మైలురాయికి చేరుకుంది. పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నాటి టీఆర్‌ఎస్‌ పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ నడిపింది. అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపు పదేళ్లు అధికార పార్టీగా కొనసాగింది. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్ష హోదాలో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయవంతంగా పని చేస్తోంది.

Trending News