Telangana Cabinet: తెలంగాణలో మంత్రి పదవుల పంచాయితీ ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. మంత్రి పదవులు దక్కకపోవడంతో రెడ్డి సామాజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈసారి కేబినెట్ విస్తరణలో ముగ్గురు నేతలు కూడా ముదిరాజ్, మాల, మాదిగ నేతలే ఉన్నారు. ఇందులో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు పదవులు దక్కాయి. మొత్తం నాలుగు పోస్టులు భర్తీ చేస్తారని ఇందులో రెడ్డి సామాజికవర్గం నుంచి ఓ నేతకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి దక్కించుకునే వారిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిపించింది. కానీ ఆయన పేరు చివరి నిమిషంలో ఆగడం వెనుక పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది..
అయితే చివరి నిమిషంలో మంత్రి పదవి మిస్ కావడంతో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు మంత్రి పదవి రాబోతుందని కొన్ని నెలలుగా ప్రచారం చేసుకున్న సుదర్శన్ రెడ్డి.. ఇప్పుడు తన సొంత నియోజకవర్గానికి ముఖం చూపించే పరిస్థితిలో లేరట. కొద్దిరోజులుగా బోధన్కు ఎమ్మెల్యే రాకపోవడంతో.. కొందరు నేతలు ఆయన్ను హైదరాబాద్ వచ్చి కలిసినట్టు తెలిసింది. ఈ సమయంలో వారితో తన ఆవేదనను పంచుకున్న సుదర్శన్ రెడ్డి.. తాను ఇప్పట్లో బోధన్కు వచ్చే పరిస్ధితి లేదని వారితో చెప్పినట్టు సమాచారం. అంతేకాదు కొందరు నేతలు మంత్రి పదవి గురించి తర్వాత ఆలోచిద్దాం.. ఓసారి నియోజకవర్గానికి రావాలని కోరితే వారిపై కస్సుబుస్సులాడినట్టు తెలుస్తోంది.
ఇక కేబినెట్ విస్తరణలో తనకు జరిగిన అవమానాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారట. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. తనకు మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా అధిష్టానం పట్టించుకోకపోవడాన్ని రాజీనామానే చివరి అస్త్రంగా భావిస్తున్నారట. ఇటీవల తనను బుజ్జగించేందుకు వచ్చిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్తోనూ ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు మద్దతుగా బాల్కొండలో ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు నేతలు నిరసనలు తెలుపుతున్నారు. కొందరైతే ప్రాణా త్యాగాలు చేస్తామంటూ వాటర్ ట్యాంకర్లు ఎక్కి నిరసనలకు దిగుతున్నారు. కానీ ప్రస్తుతం సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒకవేళ సుదర్శన్ రెడ్డి రాజీనామా చేస్తే బోధన్ లో ఉపఎన్నిక తప్పదనే టాక్ వినిపిస్తోంది.
మొత్తంమీద బుగ్గకారులో తిరిగే యోగం సుదర్శన్ రెడ్డి దాదాపు లేనట్టేనన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్లో మరో ముగ్గురు నేతలను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మొన్నటివరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 11 శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు ఇచ్చేశారు. ప్రస్తుతం సీఎం దగ్గర హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. వాటిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పట్లో ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన తన శాఖలపై పట్టు సాధిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న శాఖలను ఇతరులకు ఇచ్చే పరిస్ధితి లేదు. కావున ఇప్పట్లో సుదర్శన్ రెడ్డికి పదవి రాకపోవచ్చని అంటున్నారు.. అయితే మంత్రి పదవి దక్కలేదని ఆవేదనతో రగిలిపోతున్న సుదర్శన్ రెడ్డి మాత్రం ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also Read: ఆ విధంగా చిరంజీవిపై పై చేయి సాధించిన మోహన్ బాబు.. అసలు కథ ఇదే..
Also Read: భీకర స్థాయికి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం.. అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









