)
Heavy Rains: ఒకవైపు కుండపోత వర్షాలు కురుస్తున్నా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంపై రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా వాటిని ఎత్తిపోసే పని చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే కాళేశ్వరం గేట్లు ఎత్తి నీటిని ఎత్తిపోయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.
రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ లను నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్-6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
వానాకాలం పంట సీజన్లో వర్షాభావంతోపాటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాజెక్టుల నీటి నిల్వలు ఇలా..
శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్
పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 14 టీఎంసీలు
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)
పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 45 టీఎంసీలు
లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ)
పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు
ప్రస్తుతం 7 టీఎంసీలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంది పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసి మిడ్ మానేరు, అన్నపూర్ణ (అనంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులు, చెక్డ్యామ్లను అన్నింటిని నింపి సుమారు 5 లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్ నింపి వాటి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, చెరువులు చెక్ డ్యామ్లన్నింటిని నింపాలని లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు సాగు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని లేఖలో హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.