69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జండా ఎగరేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన పవర్ స్టార్.. నిన్న కేంద్ర ప్రభుత్వం మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషణ్, కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతీ ఏడాది ప్రకటిస్తోన్న పద్మ అవార్డుల జాబితాలో తెలుగు సినిమా లెజెండ్స్‌కి సముచిత స్థానం దక్కడం లేదని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. 


తెలుగు సినిమా గర్వించదగిన సినీ ప్రముఖులైన ఎస్వీ రంగారావు, మహానటి సావిత్రి గార్లకు పద్మ అవార్డులతో గౌరవించడమే వారికి మనం అందించే ఘనమైన నివాళి అవుతుంది అని అభిప్రాయపడిన పవర్ స్టార్.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం వుందని విజ్ఞప్తి చేశారు.