
Harish Rao vs Revanth Reddy: భారీ ఆశల్లో ముంచి ప్రభుత్వ ఉద్యోగులను నట్టేటా ముంచారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను అరకొర ప్రకటనలు చేసి కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. 'ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేబినెట్ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, పంచ పాండవులు ఎంత మంది అంటే మంచం కోళ్లలాగ ముచ్చటగా ఇద్దరు అని ఒక వేలు చూపించినట్లు ఉంది' అని ఎద్దేవా చేశారు.
మంత్రివర్గ నిర్ణయాలపై 'ఎక్స్' వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డీఏలను తక్షణం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో నమ్మ బలికి 5 డీఏలు పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఉసూరు మంటూ ఒక్క డీఏ విడుదల చేశారు. ఇదేనా డీఏలు సకాలంలో ప్రకటించడం, బకాయిలను నేరుగా చెల్లించడం అంటే రేవంత్ రెడ్డి?' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
'అధికారంలో వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఏర్పాటు అని మభ్య పెట్టి 18 నెలలు గడుస్తున్నా దాని ఊసే లేదు. ఆరు నెలల తరువాత ఇంకో డీఏ అని చెప్పడం విడ్డూరం. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి రెండు డీఏలు ఉద్యోగస్తులకు ఇస్తారు. 2025 జనవరి డీఏ కేంద్రం మార్చి లో ప్రకటించారు. జూలై నెల డీఏను సెప్టెంబర్లో కేందం ప్రకటించే అవకాశం ఉంది. అటువంటి అప్పుడు 6 నెలల తర్వాత డీఏ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ పథకం జీఓను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరం. పీఆర్సీ ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదు. ఇవేవీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం' అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు.
అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు అన్ని తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు ఇచ్చిన చెక్కులపై మళ్లీ క్యాబినెట్ నిర్ణయం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గతంలో రెండు సార్లు మీరు పంపిణీ చేసిన చెక్కులకు విలువ లేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయం లేకుంటే అప్పుడు ఎందుకు చెక్కులు ఇచ్చినట్లు అని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు.
'నవంబర్ 19, 2024 నాడు వరంగల్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించారు. మళ్లీ అవే చెక్కులను మార్చి 8, 2025 నాడు ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్లో నిర్వహించిన సభలో సీఎం అందించారు. స్వయంగా ముఖ్యమంత్రి మహిళ సంఘాలకు రెండుసార్లు అవే చెక్కులు ఇచ్చినా ఇప్పటికి చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు మరోసారి మంత్రివర్గ నిర్ణయం అంటూ మాటలు చెబుతున్నారు? ఇంకెన్ని సార్లు చెక్కులు, నిర్ణయాలు.. ఈసారైనా చెక్కులు క్లియర్ అవుతాయా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook