)
Group-1 Appointment Letters: తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయని.. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం… ఇది తెలంగాణ భవిష్యత్ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.. తెలంగాణ ఎక్కడున్నది.. ఎక్కడ ఉంటది అని. వారికి నేను ఒక్కటే చెబుతున్నా తెలంగాణ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటది' అని తెలిపారు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో మీకు తెలుసని పేర్కొన్నారు.
హైదరాబాద్లో శనివారం గ్రూప్-1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ కొంత మంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారు' అని తెలిపారు. తెలంగాణ ప్రజలు వారికి నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారని చెప్పారు. నమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
'పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం. యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం' అని ముఖ్యమంత్రి వివరించారు.
'పరీక్షలు నిర్వహించాం.. ఇది కొంతమందికి నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో మీకు తెలుసు. కొంతమంది రూ.2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించారు. అయినా మీ భవిష్యత్ కోసం కొట్లాడాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగామని చెప్పారు. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు నాకు మీ భవిష్యత్ మాత్రమే కనిపించిందని పేర్కొన్నారు.
'తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి.. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి' అని సీఎం తెలిపారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు మీరు సహకారం అందించాలని కోరారు. ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ అని ప్రకటించారు. 'మీరు, మేము కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం' అని సీఎం తెలిపారు. మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే అని చెప్పారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook