)
Telangana CM speech: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రి కావాలన్న తన కోరికను బహిరంగంగానే తెలిపారు. “నాకు స్వార్థం ఉంది.. రెండోసారి సీఎం కావాలని అనుకుంటున్నాను. కానీ నేను ఒంటరిగా ఏం చేయలేను. ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేస్తేనే ఆ అవకాశం వస్తుంది” అని స్పష్టం చేశారు. తన పదవిని కొనసాగించడమే లక్ష్యం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చడమే తన ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చిందని విమర్శించారు. నూతన నియామకాలు జరగకపోవడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మూతపడే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. “విద్య అనేది దేశం భవిష్యత్తును తీర్చిదిద్దే పునాది. ఆ బాధ్యత ఉపాధ్యాయులదే. అందుకే నేను స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తూ ప్రతీ సమస్యను పరిష్కరిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు తరగతులను ప్రారంభించామని, విద్య నాణ్యత విషయంలో ప్రైవేట్ స్కూళ్లను మించేలా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. “ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను” అని చెప్పారు.
ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం 200 మందిని విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్ ప్రకటించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం రావడానికి విద్యా రంగంలో తీసుకున్న సంస్కరణలే కారణమని గుర్తు చేస్తూ, తెలంగాణలో కూడా విద్యాభివృద్ధే తన విజయానికి మార్గం అవుతుందని అన్నారు.
రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను సీఎం గుర్తు చేశారు. “ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదం తీసుకెళ్లింది ఉపాధ్యాయురాలే. ప్రతి స్కూల్లో తెలంగాణ గీతాన్ని పాడించినవారూ ఉపాధ్యాయులే” అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి తాను ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేసుకున్న రేవంత్, టీచర్లు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. “ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లకే ఎక్కువ నైపుణ్యం ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యాశాఖను వివాదాస్పదంగా భావించి తనకు దూరంగా ఉంచమని పలువురు సూచించినప్పటికీ, తాను ఆ బాధ్యతను స్వయంగా తీసుకుని పర్యవేక్షిస్తున్నానని సీఎం తెలిపారు. “నేను ఫామ్ హౌస్లో కూర్చుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అని అడగను. నేను కూడా మీతో పాటు కష్టపడతాను. మీ కృషి, నా కృషి కలిస్తేనే రెండోసారి సీఎంగా అవకాశం వస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
రెండోసారి సీఎం కావాలన్న తన కోరికను రేవంత్ బహిరంగంగా ప్రకటించినా, అది కేవలం వ్యక్తిగత స్వార్థం కాదని, విద్యా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే ఆ స్వప్నం నెరవేరుతుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.