KCR Warangal Speech: కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై.. కేసీఆర్ ప్రసంగంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. 'నా పేరు తీయడానికి ధైర్యం రాలేదు' అని పేర్కొన్నారు. 'కేసీఆర్ మాటల్లో.. కళ్లల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా?' అని ప్రశ్నించారు. పదేళ్లు దోచుకున్న వారికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. తమ పాలనతో తెలంగాణ ఆగం కాలేదని ప్రకటించారు. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? అని నిలదీశారు.
Also Read: Summer Best Tour Places: సమ్మర్ సెలవుల్లో బెస్ట్ టూర్ ప్లేస్లు ఇవే.. జీవితంలో మరచిపోరు
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన మహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బసవన్న స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నామని తెలిపారు. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. 'వరంగల్లో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. వాళ్లు రజతోత్సవాలు, విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది' అని రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్ ట్విస్ట్.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్
'మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు. ఇది ఏ చట్టంలో ఉంది?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'ప్రతిపక్ష నాయకుడిగా రూ.65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు' అని తెలిపారు. 'మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
'రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు వేశారు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తామని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి అని సవాల్ చేశారు. 'కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం అని సూచించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే విధానంతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









