తెలంగాణ సమగ్రాభివృద్ధికి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాలతో రోజులు గడిపేకంటే... భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రగతి సాధించాలి? ఏయే రంగాలను అభివృద్ధి చేయాలనే అంశాలపై మేధోమథనంతో గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ రూపురేఖలను మార్చాలని రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా... సవాళ్లను ఎదుర్కొంటూ సత్ఫలితాల సాధన కోసం సమాయాత్తమయ్యారు. ఆర్థిక ఇబ్బందులో సతమతమవుతూనే.. విమర్శలు ఎదుర్కొంటూ.. అనుకున్నపనులు చేసుకుంటూ ముందడుగు వేశారు. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రధాన నగరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తూనే... ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షతో అభివృద్ధి ప్రణాళికపై సమాలోచనలు చేస్తున్నారు.
తెలంగాణ అన్నిరంగాల్లో ఎదగాలి.. ఆర్థిక వృద్ధి సాధించాలి… విదేశీపెట్టుబడులు సాధించాలి.. బహుముఖంగా పారిశ్రామికంగా ప్రగతి సాధించాలి.. ప్రపంచదేశాలతో పోటీపడే నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దాలి. ఇదీ ప్రభుత్వ లక్ష్యం.. రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ దార్శనికతతో తెలంగాణ రూపురేఖలను మార్చే ప్రయత్నంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దేశంలో ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్ విస్తరణకు భౌగోళిక అంశాలు అనుకూలిస్తుండటంతో సరికొత్తగా ఫ్యూచర్ సిటీని సృష్టించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే భూసేకరణ పూర్తిచేశారు. విభిన్న హంగులతో సరికొత్త నగరాన్ని ఏర్పాటుచేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరీకరణతో ప్రపంచ శ్రేణి నగరాన్ని ఆవిష్కరించేదిశగా పరుగులు తీస్తున్నారు.
మాటలు వేరు.. చేతలు వేరు.. హామీలు అమల్లోకి తీసుకురావడం ఓ ఎత్తైతే... పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో పాలకులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర విస్తరణకు, అభివృద్ధికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా అమల్లోకి తెచ్చేశారు. తెలంగాణకు గుండెగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు విలీన ప్రక్రియ బాధ్యతలను చేపట్టారు.బాబు, వైయస్ఆర్, కేసీఆర్ నగరంపై తనదైన ముద్ర వేసారు. ఈ రకంగా నగరంపై తన శాశ్వత ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన ఒక ఎత్తయితే... భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. యువత, విద్యావంతులు, మేధావులు, మహిళల అభిప్రాయాలతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. ఇప్పటిదాకా తెలంగాణలో సాగిన అభివృద్ధి వేరు... వ్యూహాత్మక ప్రణాళికతో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే మార్పులు చేర్పులను తెలంగాణ ప్రజలకే కాదు, ప్రపంచానికి వివరించాలనే ఉద్ధేశంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భూతల స్వర్గంగా మాటలతో చెప్పడంకాదు.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిచేసే చోట రెండు రోజులపాటు.. నేడు రేపు (డిసెంబరు 8, 9 తేదీల్లో) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.ఆదివారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారికంగా ప్రారంభించారు.
అవసరాలకు అనుగుణంగా వ్యహాత్మక ప్రణాళిక అద్భుత ఫలితాలను ఇస్తుందని పాలకులు భావిస్తున్నారు. ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక సిద్ధమైంది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఫ్యూచర్ సిటీలో కొలువు దీరబోతున్నాయి. ఆర్ధిక ఇబ్బందుల్లోంచి తెలంగాణను గట్టెక్కించాలి… పారిశ్రామిక ప్రగతితో పొరుగురాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.
భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 2047 సంవత్సరం నాటికి వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ వంతు బాధ్యతాయుత పాత్ర పోషించే విధంగా వ్యూహాత్మక ప్రగతి సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో ఎప్పటి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకుంటూ... ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పట్టణ ప్రణాళికలతోపాటు, గ్రామీణాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేశారు.
Read more: Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..
Read more: నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..
2047 నాటికి తెలంగాణ లక్ష్యం... మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఉవ్వీళ్లూరుతున్నారు. దీనికోసం అంతర్జాతీయ, జాతీయ సంస్థలను ఆకర్షించి... పెట్టుబడులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సమ్మిట్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఫ్యూఛర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలను చాటుతూనే భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచం ముందుంచనున్నారు.
రెండు రోజుల్లో 27 అంశాలపై ప్లీనరీలను నిర్వహించబోతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, నీతి అయోగ్, వివిధ డైరెక్టరేట్ల నిపుణులతో విస్తృత చర్చలు జరపబోతున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీలో భాగంగా ఉన్నత విద్యావకాశాలు, నైపుణ్యాల పెంపునకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇస్తున్న ప్రాధాన్యం, టాలెంట్ మొబిలిటీ, కెనడా సెషన్ ఉంటాయి. సదస్సుకు హాజరయ్యే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు చేసుకోనుంది.ఇప్పటికే ఈ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించారు. వారందరు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
(రచయత..మునిరాజ్ జీ న్యూస్ డెస్క్)
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









