Telangana Police High Alert: భారత్, పాకిస్థాన్ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. పోలీస్ అధికారులు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలని.. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించింది.
Also Read: India Pakistan War: పాకిస్థాన్ వక్రబుద్ధి.. ప్రజలను అడ్డం పెట్టుకుని భారత్ సైన్యానికి ఇబ్బందులు
భారత్, పాకిస్థాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హై లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తోపాటు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుతో డిప్యూటీ సీఎం చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
Also Read: India Pakistan War: పాకిస్థాన్తో యుద్ధం దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత? వాస్తవమేమిటి?
'ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించడానికి అన్ని జిల్లాల్లో సంఘీభావ ర్యాలీని నిర్వహించాలి. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి కట్టడి చేయాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేసి మాక్డ్రిల్ ట్రయల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దుచేసి వారి అందుబాటులో ఉండాలని చెప్పారు. వార్తా ప్రచారాల్లో తగు జాగ్రత్తల కోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
'సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలి. రక్షణ శాఖకు సంబంధించిన పరికరాల తయారీకి సంబంధించిన పరిశ్రమల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి భవనాల స్లాబుపైన ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని అన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాం' అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. 'శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వద్ద భద్రత పెంచాం. డీఆర్డీఏ, డీఆర్డీఓ, ఎన్ఎఫ్సీ వంటి కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. 24/7 పెట్రోలింగ్ నిర్వహిస్తూ సీసీటీవీల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం' అని డీజీపీ జితేందర్ రెడ్డి వివరించారు.
సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం కాకుండా సైబర్ టీంలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలను కట్టడి చేస్తున్నామని.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి పర్యవేక్షణ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









