
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొందరు నేతలు సంతృప్తిగా ఉంటే.. మరికొందరు నేతలు మాత్రం తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలో తమకు పదవులు దక్కడం లేదని పార్టీ హైకమాండ్ను ధిక్కరిస్తున్నారు. అయితే పార్టీపై కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్న క్రమశిక్షణ కమిటీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో.. ఆ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాగా.. మరొకరు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు హైకమాండ్కు తలనొప్పిగా మారారనే చర్చ జరుగుతోంది..
కొద్దిరోజులుగా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో రాజ్గోపాల్ రెడ్డి ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడం వెనుక సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. అందుకే పదేపదే సీఎంను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందని, తన పనితీరును గుర్తించి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు సమర్ధులు ఉంటే... వారికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజ్గోపాల్ రెడ్డి సీఎంను ఓ రేంజ్లో టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా.. క్రమశిక్షణ కమిటీ ఎందుకు పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి రాజ్గోపాల్ రెడ్డి తీరుతో డ్యామేజ్ జరుగుతుందని ఇలాగే వదిలేస్తే మరింత నష్టం ఖాయమని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాజ్గోపాల్రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా చర్యలకు వెనకాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్గోపాల్ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు సీఎంను పరేషన్ చేస్తోంది..
మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు.. మాటలతో కాకపోయినా.. చేతలతో సీఎంకే చేయాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం మీటింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.. దాంతో అధికార పార్టీకి దొంతి కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయారని ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహారం మాత్రం సొంత పార్టీ నేతలకు కూడా అంతుచిక్కడం లేదని.. ఆయన తీరుతో నర్సంపేట నియోజకవర్గానికి కూడా తీరని అన్యాయం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది..
ఇక్కడే మరో చర్చ జరుగుతోంది. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి.. గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా.. కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్కు పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు.. అప్పట్లో టీపీసీసీ చీఫ్కు అడగడుగునా అడ్డంకులు సృష్టించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మొత్తం సీన్ మారిపోయింది. గతంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి లీడర్లు ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఐదేళ్లే కాదు.. మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి వెంకట్ రెడ్డి అంటున్నారు. అటు జగ్గారెడ్డి కూడా ముఖ్యమంత్రిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని అంటున్నారు.
మొత్తంమీద గతంలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినా నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. సీఎంతో తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు..ఇందులో దొంతి మాధవరెడ్డి సీఎంను బహిరంగంగా విమర్శించడం లేదు. కానీ.. రాజ్గోపాల్ రెడ్డి మాత్రం.. హైకమాండ్కే సవాల్ విసురుతున్నారు. అయితే త్వరలోనే రాజ్గోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది..