హుజూర్నగర్ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీ వినోద్కుమార్ ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి సీపీఐ పార్టీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీలో ఇరుపార్టీల నేతల మధ్య మంతనాలు జరిగాయి. అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత కేశవరావు మాట్లాడుతూ టీఆర్ఎస్-సీపీఐ నేతల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ పోటీచేయడం లేకపోవడంతో వారి మద్దతు కోరినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనపై సీసీఐ నేతలు సానుకూలంగా స్పందించారని... అయితే వారు పార్టీలో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. తమకు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్న ట్టు కే కేశవరావు విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ మాట్లాడుతూ ఉప పోరులో టీఆర్ఎస్ పార్టీ తమ మద్దతు కోరిందన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్, సీపీఐ పార్టీలు పాత మిత్రులేనని.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. అక్టోబర్ 1న జరిగే పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని చాడ స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ చేధు అనుభవాన్ని చూసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత మహాకూటమి పార్టీలతో దూరంగా ఉంటూ సొంత కార్యకరణతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సీపీఐ మద్దతు కోరడం గమనార్హం