Fibrebond CEO: ఫైబర్ బాండ్ సీఈవో గ్రాహం వాకర్ ఉదారత.. ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ. 4 కోట్లు..

Fibrebond CEO:పూర్వికుల సంపద పెట్టుబడిగా మారింది... స్థాపించిన పరిశ్రమ అగ్నిప్రమాదంతో బూడిదపాలైంది...నాన్న కష్టార్జితం కనుమరుగైపోయింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.... ఏమీ చేయలేని పరిస్థితి... ఇవంతా జీవితంలో ఊహించని పరిణామాలు..  అయినా ఉద్యోగులను దూరం చేసుకోలేదు... ఆ కుటుంబాలను పోషించారు. కలిసొచ్చినకాలంలో.. అద్భుతాన్ని ఆవిష్కరించారు.  కష్టంలో అండగా నిలిచి.. కంపెనీ వృద్ధిలో భాగమైన ఉద్యోగులకు ఫైబర్ బ్రాండ్  యజమాని గ్రాహం వాకర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. జీవితకాలంలో ఊహించని గిఫ్ట్ తో ఆ ఉద్యోగులు ఎవరికివాళ్లు  మైమరచిపోయారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 19, 2026, 12:30 AM IST
Fibrebond CEO: ఫైబర్ బాండ్ సీఈవో గ్రాహం వాకర్ ఉదారత.. ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ. 4 కోట్లు..

Fibrebond CEO Gift to Employees: గ్రాహం వాకర్.. ఫైబర్ బ్రాండ్ సృష్టికర్త. సంపదను పెట్టుబడిగా పెట్టడం వేరు... పరిశ్రమలను స్థాపించడం వేరు... లాభనష్టాలను భరించడం వేరు... కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలివ్వకుండా... ముప్పుతిప్పలు పెట్టే యాజమాన్యాలున్న ఈరోజుల్లో... అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయినా... ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఏనాడూ వాళ్లను ఇబ్బంది పెట్టలేదు. వాళ్లను పస్తులు ఉంచలేదు. ప్రతినెలా ఆయా కుటుంబాలను పోషించుకోడానికి ఎవరి వేతనాలు వారికి బ్యాంకుల్లో వేసేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ కంపెనీ యజమాని పట్ల ఉద్యోగులకు ఉన్న విశ్వాసం..వారిని ఇపుడు కోటీశ్వరులను చేసింది. 

Add Zee News as a Preferred Source

అపారమైన వ్యాపార అనుభవం క్లాడ్ వాకర్ కుటుంబానిది. కలప వ్యాపారంతో ప్రత్యేకత సంతరించుకున్న క్లాడ్ వాకర్ మారిన రోజులకు అనుగుణంగా కొత్త కంపెనీ ప్రారంభించాలని  భావించారు. అమెరికా  ఆగ్నేయ మెక్సికో గల్ఫ్ పరిసరాల్లోని లూసియానా ప్రాంతంలో 1982లో టెలిఫోన్ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తిచేసే పరిశ్రమను స్థాపించారు. 12 మంది కార్మికులతో కార్యకలాపాలను ప్రారంభించారు.  అవసరాలకు అనుగుణంగా టెలిఫోన్ స్తంభాలను, టెలిఫోన్ టవర్స్ సామగ్రి తయారీ చేయాలని ఫైబర్ బాండ్ పేరుతో 1990లో కాంక్రీట్ ఎన్ క్లోజర్ల తయారీకి శ్రీకారం చుట్టారు. వ్యాపారం ఊపందుకుంది. ఉపాధి కార్మికుల సంఖ్య క్రమేణ పెరిగింది. ఎనిమిదేళ్ల తర్వాత 1998లో పరిశ్రమ  అగ్నిప్రమాదానికి గురైంది. కంపెనీ భస్మీపటలమైంది. క్లాడ్ వాకర్ సంపద బుగ్గిపాలైంది. ఆశలు ఆవిరయ్యాయి.

నాన్న పడే కష్టాన్ని చూస్తూ ఎదిగిన క్లాడ్ వాకర్ ఇద్దరు కుమారుల్లో ఒకరైన గ్రాహం వాకర్.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నాన్న క్లాడ్ వాకర్ కు తోడుగా ఉండే వాడు. 2000 సంవత్సరం మధ్యకాలంలో గ్రాహం వాకర్ కంపెనీని పునరుద్ధరించే బాధ్యతలను తీసుకున్నాడు. అంతకు ముందు అగ్నిప్రమాదంతో పరిస్థితి కుదేలైనప్పటికీ.. అక్కడ పనిచేసే కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచాడు. కంపెనీ నడవకపోయినా... జీతాలను ఏనాడూ పెండింగులో పెట్టలేదు. ఆ కుటుంబాలు గడిచేందుకు మానవతా ధృక్పధంతో ఆదుకున్నాడు. పదేళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ కంపెనీ నిర్వహణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కార్మికులు ఆకలితో అలమటించకూడదన్నదే గ్రాహం వాకర్ ఉద్ధేశం.

కాలక్రమంలో ఫైబర్ బాండ్ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి నిర్వహణతో నడిపే కంపెనీగా మారింది. 2015లో గ్రాహం వాకర్ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలో ఉత్పత్తులు తయారీకీ పరిశ్రమను విస్తరించారు. డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ఉత్పత్తితోపాటు, విద్యుత్తు ఉపకరణాలను తయారు చేసే స్థాయికి పరిశ్రమ ఎదిగింది.

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిలబెట్టిన కంపెనీలో 540 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2020లో కోవిడ్ పరిస్థితులు ముసురుకున్నాయి. ఆ సమయమే వారికి స్వర్ణయుగంగా మారింది. రోజులు మారే కొద్దీ అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బూమ్ తోడైంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. డేటా సెంటర్ల విస్తరణకు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు చేస్తున్న ఫైబర్ బాండ్ సంస్థకు కాలం కలిసొచ్చింది. కోవిడ్ సమయంలో ఫైబర్ బాండ్ ఉత్పత్తుల అమ్మకాలు 400 రెట్లు పెరిగాయి. ఊహించని విధంగా కంపెనీ వృద్ధిలోకి వచ్చేసింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు తరచూ గ్రాహం వాకర్ మాట్లాడుతుండేవారు. పరిశ్రమలో కార్మికులు అలుపెరుగక రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగింది. దీంతో వివిధ దేశాల్లో డేటాసెంటర్ల విస్తరణకు యంత్ర సామాగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలను విస్తృతంగా ఉత్పత్తిచేసే దిగ్గజ ఈటన్ కంపెనీ ఫైబర్ బాండ్ ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఇపుడు ఫైబర్ బాండ్ కంపెనీ నిర్వహణ బాధ్యతలను ఈటన్ కంపెనీ చూసుకుంటోంది. ఫైబర్ బాండ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో రెండు వేల కోట్లను ఉద్యోగులకు బోనస్ గా అందించారు. 540 మందికి కార్మికుల ఖాతాల్లో జమచేశారు. ఊహించని విధంగా బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ చూసుకున్న కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కొక్క కార్మికుడు నాలుగు కోట్ల రూపాయలను గతేడాది క్రిస్మస్ బోనస్ గా అందుకున్నారు. ఈ డబ్బులతో ఆ కార్మికులు  ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేశారు. అప్పులు తీర్చేసుకున్నారు. జీవిత కాలం ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో సంపాదించలేమని ఆనంద బాష్పాలతో  కార్మికులు తబ్బిఉబ్బిపోయారు. కంపెనీ యజమాని  గ్రాహం వాకర్ దేవుడిలా సాయంచేశారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్వార్థమే పరమావధిగా రాణిస్తున్న ఈ రోజుల్లో అమెరికా గడ్డపై కార్మిక కుటుంబాల పట్ల ఉదారతను చాటుకున్న గ్రాహం వాకర్ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి పారిశ్రామిక వేత్తలు మరింతమంది పుట్టుకురావాలని, కార్మికుల కుటుంబాల్లో ఆనందం నింపాలని ఆశిద్ధాం.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్)

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News