)
School Building Collapse: ఇండోనేషియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్స్లోని సిడోర్జో పట్టణంలో ఉన్న అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాల భవనం మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, కనీసం 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, సైన్యం రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని గాయాలతో బయటకు తీశారని, మరికొందరి మృతదేహాలు కూడా వెలికితీసినట్లు సమాచారం. అధికారులు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వయస్సు 12 నుండి 17 సంవత్సరాల మధ్య ఉందని సమాచారం. ప్రమాదం సంభవించిన సమయంలో చాలామంది విద్యార్థులు మధ్యాహ్న ప్రార్థనలు చేస్తుండగా భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో చాలామంది లోపలే చిక్కుకున్నారు. ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి జూల్స్ అబ్రహం అబాస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాల భవనం విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం అనధికార విస్తరణలో ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సంఘటన జరిగిన 12 గంటలకు పైగా అయినా, శిథిలాల మధ్య చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. భారీసంఖ్యలో పోలీసులు, సైనికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కూడా అక్కడే గుమికూడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియాలో తరచూ భవనాల కూలిపోవడం, నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ ఘటన కూడా అదే నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కూలిన పాఠశాల శిథిలాలను పూర్తిగా తొలగించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook