)
Former prime minister and BNP chairperson Khaleda Zia: బంగ్లాదేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక శకానికి ముగింపు పలికింది. దేశ తొలి ప్రధాని.. మూడుసార్లు ప్రధానిగా చేసిన బేగం ఖలీదా జియా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బేగం ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా మూగబోయింది. ఇక.. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను చూసినట్లయితే.. గత కొన్ని దశాబ్దాలుగా ఆ దేశ రాజకీయాలను ప్రధానంగా ఇద్దరు మహిళలు శాసించారు. ఒక వైపు బంగాబందు కుమార్తెగా పేరొందిన షేక్ హసీనా.. మరోవైపు ఉక్కు మహి, ప్రజాస్వామ్య తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న బేగం ఖలీదా జియా.. వీరిద్దరి మధ్య జరిగిన రాజకీయ పోటీ, విభేదాలు, ఘర్షణలు, బంగ్లాదేశ్ రాజకీయాలకు దిశానిర్దేశం చేశాయి.
బేగం ఖలీదా జియా 1945 ఆగస్టు 15న అప్పటి అవిభక్త బెంగాల్లోని జల్పైగురిలో జన్మించారు. ఈ ప్రాంతం ఇప్పుడు భారత్ లో ఉంది. ఆమె కుటుంబం తరువాత బంగ్లాదేశ్లోని దినాజ్పూర్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. 1959లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే.. పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్గా పనిచేస్తున్న జియావుర్ రెహమాన్ను ఖలీదా జియా వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఖలీదా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఒక సాధారణ గ్రుహిణిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారు.వారికి ఇద్దరు కుమారులు.. తారిక్ రెహమాన్, అరాఫత్ రెహమాన్ (కోకో)..వారి పెంపకమే ఆమె జీవితంగా సాగింది.
అయితే.. జియావుర్ రెహమాన్ జీవితం బంగ్లాదేశ్ చరిత్రలో కీలక మలుపు అని చెప్పవచ్చు. ఆయన 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 1977లో దేశ అధ్యక్షుడయ్యారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో.. 1981 మే 30న చిట్టగాంగ్లో జరిగిన ఓ సైనిక తిరుగుబాటు ప్రయత్నంలో జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఖలీదా జియా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
భర్త మరణంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి వరకు వంటింటికే పరిమితమైన జియా.. భర్త మరణంతో బయటి ప్రపంచాన్ని చూసింది. ఆయన స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా పతన అంచున నిలిచింది. పార్టీ కార్యకర్తల ఒత్తిడి, ప్రజల మద్దతుతో ఖలీదా 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984లో BNP అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి బంగ్లాదేశ్ సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు.
ఎర్షాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఖలీదా జియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక సార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరకు 1990లో ఎర్షాద్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన 1991 సాధారణ ఎన్నికల్లో BNP విజయం సాధించడంతో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ఆమె తొలి పదవీకాలంలో ఆర్థిక సంస్కరణలు.. ఎగుమతుల పెరుగుదల, తాత్కాలిక ప్రభుత్వ (కేర్టేకర్ గవర్నమెంట్) వ్యవస్థ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత కొంతకాలం రాజకీయ ఒడిదుడుకుల తర్వాత 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఈ రెండో పదవీకాలం అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, మత ఛాందసవాదులపై చర్యలు వంటి అంశాలతో తీవ్ర వివాదాలకు లోనైంది.
ఇదే సమయంలో షేక్ హసీనా–ఖలీదా జియా మధ్య శత్రుత్వం మరింత తీవ్రమైంది. గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఈ ఇద్దరి చుట్టూనే తిరిగాయి. వీరి మధ్య పోరును ప్రజలు బేగంల యుద్ధంగా పిలిచేవారు. తొలుత ఎర్షాద్ను కూలదోసేందుకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. తర్వాత తీవ్ర రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. భర్త, తండ్రి హత్యలు, కుటుంబ వారసత్వాలు ఈ వైరాన్ని మరింత పెంచాయి.
2008 తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖలీదా జియాపై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. 2018లో ఆమె జైలుకు వెళ్లారు. తీవ్ర అనారోగ్య కారణాలతో తర్వాత బెయిల్పై విడుదలై గృహ నిర్బంధంలో ఉన్నారు. 2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితులు మారాయి. ఖలీదా జియాపై ఉన్న కేసులు ఎత్తివేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు VVIP భద్రత కల్పించింది. అయితే అప్పటికే ఖలీదా జియా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. లివర్ సిర్రోసిస్, కిడ్నీ వైఫల్యం, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆమె తీవ్రంగా బాధపడుతున్నారు. వెంటిలేటర్, డయాలసిస్ సహాయంతో చికిత్స పొందినా.. శరీరం చివరకు తట్టుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఆమె మరణానికి ఐదు రోజుల ముందు.. డిసెంబర్ 25న.. పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత లండన్ నుంచి బంగ్లాదేశ్కు తిరిగొచ్చాడు. రాజకీయ వేధింపుల కేసులతో 2008 నుంచి విదేశాల్లో ఉన్న తారిక్, అక్కడి నుంచే BNPని నడిపించాడు. అతని రాకకు లక్షలాది మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలో ఉన్న తల్లిని కలిసిన తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టాడు.
డిసెంబర్ 30, 2025 ఉదయం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో 80 ఏళ్ల వయసులో బేగం ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు… బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక కీలక అధ్యాయానికి ముగింపు. ఇప్పుడు అందరి చూపూ తారిక్ రెహమాన్పైనే ఉంది. ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో BNP బలమైన పోటీదారుగా నిలవనుంది. తల్లి రాజకీయ వారసత్వాన్ని తారిక్ ముందుకు తీసుకెళ్లగలడా? అస్థిరత, ఆర్థిక సంక్షోభం, హింసతో పోరాడుతున్న బంగ్లాదేశ్కు ఆయన నాయకత్వం దిశానిర్దేశం చేయగలదా? అనే ప్రశ్నలకు రాబోయే రోజులు సమాధానం చెప్పనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.