తూర్పుగోదావరి: అడ్డంకులను అధిగమిస్తూ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల కవాతు ప్రారంభమైంది. పోలీసుల సూచన మేరకు కాలిబాట కాకుండా కారులోనే పవన్ సభా స్థలికి వెళ్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నిర్వహిస్తున్న కవాతులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం వరకు జనసేన కవాతు సాగుతోంది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవాతుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన నేతలకు రాజమండ్రి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కవాతులో లక్షల సంఖ్యలో పాల్గొనే అవకాశముందని.. బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉండటం వల్ల 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. అంతేకాదు బహిరంగ సభాప్రాంగణం సరిపోదని.. మరో చోట సభ నిర్వహించుకోవాలని జనసేన నేతలకు రాజమండ్రి అర్బన్ పోలీసులిచ్చిన నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నడమ జనసేన కవాతు ప్రారంభం కావడం గమనార్హం.