పోరాడి ఓడిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం

    

Last Updated : Nov 21, 2018, 05:54 PM IST
పోరాడి ఓడిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం

బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. వాన కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో 174 పరుగులు చేయాల్సిన మన ఆటగాళ్లు 169/7కే పరిమితయ్యారు. ధావన్  (76: 42 బంతుల్లో 10x4, 2x6) హాఫ్ సెంచరీ చేసినా.. అనుకోకుండా ఆయన అవుట్ అవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 174 పరుగులు చేయాల్సి ఉంది. వర్షం  కారణంగా 17 ఓవర్లకి మ్యాచ్‌ని కుదించడంతో ఆ పరిస్థితి ఎదురైంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆటగాళ్ళలో గ్లెన్ మాక్స్‌వెల్ (46: 24 బంతుల్లో 4x6),  స్టాయినిస్ (33 నాటౌట్: 19 బంతుల్లో 3x4, 1x6), క్రిస్‌లిన్ (37: 20  బంతుల్లో 1x4, 4x6) రెచ్చిపోయి ఆడడంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేయడం జరిగింది. 16.1 ఓవర్లకి ఆసీస్ 153/3తో నిలిచిన దశలో వర్షం విపరీతంగా పడింది. ఈ క్రమంలో వాన కారణంగా ఎంపైర్స్ 17 ఓవర్లకి  మ్యాచ్‌ని కుదించి.. ఆసీస్‌కి ఐదు బంతులు ఆడే అవకాశం ఇవ్వడంతో వారు ఆ స్కోరు చేయగలిగారు. దాంతో వారి స్కోరు 158/4 గా నమోదైంది. అలాగే భారత్‌కు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో  174 పరుగులు  చేయాలని సూచించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచినా.. కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఆసీస్ ఆటగాళ్లలో గ్లెన్ మాక్స్‌వెల్ (46 పరుగులు) ఒక్కడిదే అత్యధిక స్కోరు. ఆరోన్ ఫించ్ (27), క్రిస్ లిన్ (37), మార్కస్ (33 పరుగులు) చేసి మంచి పునాది వేశారు. తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన భారత్ ఆటగాళ్లలో ధావన్ (76), దినేష్ కార్తిక్ (30) రాణించినా.. భారత్ విజయం సాధించలేకపోయింది. 

Trending News